సిటీబ్యూరో, జూన్ 28 (నమస్తే తెలంగాణ): తృణ ధాన్యాల్లో ప్రధానమైన రాగుల విత్తనోత్పత్తిలో ఎదురవుతున్న ఇబ్బందులకు ఇక్రిసాట్ పరిష్కారం చూపింది. జన్యు సవరణతో మేలురకం రాగులను ఉత్పత్తి చేసే పద్ధతులను రూపొందించింది. అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ జార్జియా పరిశోధన బృందంతో కలిసి రాగుల బ్రీడింగ్ కోసం ప్రత్యేక ప్రొటోకాల్ రూపొందించింది.
పోషక విలువలు, అధిక దిగుబడి, తెగుళ్ల్లను తట్టుకునే సామర్థ్యంతో కూడిన ఆధునిక ఫింగర్ మిల్లెట్ రకాల అభివృద్ధిపై ఇక్రిసాట్ దృష్టి సారించింది. వాతావరణ మార్పులకు అనుగుణంగా రాగుల్లో పోషకాలు క్షీణించకుండా నియంత్రించడంపై పరిశోధించి సక్సెస్ అయింది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న విత్తనాల కంటే ఇక్రిసాట్ డెవలప్ చేసిన బ్రీడ్కు నాణ్యత ఎక్కువ. ప్రస్తుత విత్తనాల్లో జన్యు మార్పిడితో కొత్త బ్రీడ్ డెవలప్ చేశారు. జన్యు నిర్మాణాన్ని డీకోడ్ చేసి, జన్యు క్రమంలో మార్పులు చేయడంతో సంతానోత్పత్తి పెరిగి దిగుబడి పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
తెలుగు రాష్ర్టాల్లోని మెట్ట భూముల్లో రాగుల సాగును ప్రోత్సహిస్తామని ఇక్రిసాట్ డిప్యూటీ డైరెక్టర్ అర్వింద్ కుమార్ తెలిపారు. జార్జియా వర్సిటీతో సమన్వయం చేసుకుంటూ జన్యు మార్పిడికి అవసరమైన టెక్నాలజీని వినియోగించడం ద్వారా విజయం సాధించామని చెప్పారు. ఐదేండ్ల క్రితమే తాము పరిశోధన ప్రారంభించామని, ఏడాది కాలంగా ఫైనల్ బ్రీడ్ కోసం జార్జియా వర్సిటీ సహాయం తీసుకున్నామని తెలిపారు. డాక్టర్ దామరీస్, డాక్టర్ హెన్రీ పరిశోధనకు నేతృత్వం వహించారని చెప్పారు.