హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): ఇబ్రహీంపట్నం సీహెచ్సీలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న నలుగురు మహిళలు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. సీహెచ్సీ సూపరింటెండెంట్ను ప్రభుత్వం సస్పెండ్ చేసిందని, ఆపరేషన్ చేసిన సర్జన్ లైసెన్సును తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తాత్కాలికంగా రద్దు చేసిందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని, వారం రోజుల్లోగా ప్రభుత్వానికి తుది నివేదిక అందజేస్తామని చెప్పారు.
మంగళవారం కోఠిలోని డీపీహెచ్ కార్యాలయంలో శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. నలుగురు మహిళలు మరణించడం అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ నెల 25న ఇబ్రహీంపట్నం సీహెచ్సీలో ‘డబుల్ పంక్చర్ లాప్రొస్కొపి’ (డీపీఎల్) విధానంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించారని వివరించారు. నిపుణులైన సిబ్బంది మొత్తం 34 మందికి సర్జరీ చేశారన్నారు.
నలుగురికి విరేచనాలు, వాంతులు వంటి గ్యాస్ట్రో సంబంధ సమస్యలు తలెత్తాయని, సమీప దవాఖానకు వెళ్లి చికిత్స పొందుతుండగా మరణించారని తెలిపారు. ఈ ఘటనపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు సమీక్ష నిర్వహించారని చెప్పారు. బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని అన్నారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల నగదు, డబుల్ బెడ్రూం ఇస్తామని హామీ ఇచ్చారని, వారి పిల్లల చదువు బాధ్యతను సైతం ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పారు.
మిగతా 30 మంది మహిళల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొనేందుకు ప్రత్యేకంగా వైద్య బృందాలను వారి ఇంటికి పంపించి పరీక్షలు చేశామని పేర్కొన్నారు. జ్వరం వంటి స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న 9 మందిని దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు. వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదన్నారు. మిగతావారి పరిస్థితి నిలకడగా ఉన్నదని తెలిపారు. రాష్ట్రంలో కు.ని ఆపరేషన్లకు 2016 నుంచే టార్గెట్లు తీసేశామని, వారంతా స్వచ్ఛందంగా వచ్చారన్నారు. కు.ని సాధారణ శస్త్రచికిత్స అని, గతేడాది రాష్ట్రంలో 1.10 లక్షల మందికి ఆపరేషన్లు చేశామని వివరించారు.
ఇందులో డీపీఎల్ పద్ధతిలో 24,233 సర్జరీలు జరిగాయని వెల్లడించారు. కేంద్రం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారమే ఆపరేషన్లు, సిబ్బంది శిక్షణ జరుగుతున్నదని అన్నారు. అయినా ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు. పురుషులు వేసెక్టమీపై దృష్టిసారించాలని కోరారు. రాష్ట్రంలో 3 శాతం మంది మాత్రమే వేసెక్టమీ ఆపరేషన్లు చేసుకుంటున్నారని అన్నారు.
బూస్టర్ వేసుకోండి
రాష్ట్రంలో కొవిడ్ పూర్తిగా అదుపులో ఉన్నదని డీపీహెచ్ తెలిపారు. ఇప్పటివరకు 6.89 కోట్ల డోసులు పంపిణీ చేశామని, మొదటి, రెండో డోసులు 100 శాతానికిపైగా పూర్తికాగా.. బూస్టడ్ డోస్లో వెనకబడి ఉన్నామని చెప్పారు. ఇప్పటివరకు 19 శాతం మంది మాత్రమే వేసుకున్నారని పేర్కొన్నారు.