హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ శిల్పకళావేదికలో శుక్రవారం జరుగనున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఇంటెలిజెన్స్ అధికారి కుమార్ అమిరేశ్ (51) ప్రమాదవశాత్తు మృతిచెందారు. బుధవారం అడ్వాన్స్ సెక్యూరిటీ లైజనింగ్ నిర్వహిస్తుండగా.. ఈ విషాదం చోటుచేసుకుంది. మదాపూర్ శిల్పకళావేదికలో శుక్రవారం జరుగనున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, ఇంటెలిజెన్స్ బ్యూరో, జీహెచ్ఎంసీ, రెవెన్యూ తదితర విభాగాల అధికారులు భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చారు. ఈ క్రమంలో ఐబీ అధికారి కుమార్ అమిరేశ్ శిల్పకళావేదికపై నుంచి ప్రాంగణానికి సంబంధించి ఫొటోలు తీస్తుండగా.. సీటింగ్కు, ఆడిటోరియం వేదికకు మధ్యనున్న ప్రదేశంలో పడిపోయారు.
అస్మారకస్థితి లోకి వెళ్లిన అతడిని హుటాహుటిన ప్రైవేటు దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం ఆయన మృతిచెందారు. అమిరేశ్ స్వస్థలం బీహార్లోని పాట్నా. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రమాదానికి సంబంధించి మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దుర్ఘటనకు సంబంధించి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. కుమార్ అమిరేశ్ మృతి అత్యంత విచారకరమని, ఆయన ఆత్మకు శాంతి కలుగాలని ప్రార్థించారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.