హైదరాబాద్, జూన్12(నమస్తే తెలంగాణ): పలువురు జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసి, పోస్టింగ్లు ఇచ్చింది. పంచాయతీరాజ్ కమిషనర్ డాక్టర్ ఏ శరత్ను సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా బదిలీ చేసింది. సంగారెడ్డి కలెక్టర్ ఎం హన్మంతరావును పంచాయతీరాజ్ కమిషనర్గా నియమించింది. నల్లగొండ జిల్లా కలెక్టర్ పాటిల్ ప్రశాంత్జీవన్ను సిద్దిపేట కలెక్టర్గా బదిలీచేసింది. సిద్దిపేట కలెక్టర్గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న హన్మంతరావును రిలీవ్ చేసింది. నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్శర్మకు నల్లగొండ జిల్లా కలెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. జోగులాంబ గద్వాల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కోయశ్రీ హర్షకు జిల్లా కలెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.
ఇప్పటివరకు అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్బాషాను రిలీవ్ చేసింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డిని ఐటీడీఏ-ఉట్నూర్ ప్రాజెక్టు ఆఫీసర్గా నియమించింది. ఇప్పటివరకు ఇక్కడ ప్రాజెక్టు ఆఫీసర్గా ఉన్న అంకిత్ను ఐటీడీఏ-ఏటూరునాగారం ప్రాజెక్టు ఆఫీసర్గా నియమించింది. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న 2019 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి చాహత్ బాజ్పాయ్ని కుమ్రంభీం ఆసిఫాబాద్ స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్గా నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.