TSPSC | హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారం వెలుగుచూడగానే తెలంగాణ సర్కారు అప్రమత్తమైంది. లీక్ అయినట్టుగా భావిస్తున్న గ్రూప్ 1, ఏఈఈ, డీఏవో పరీక్షలను వెంటనే రద్దుచేసింది. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, టీపీబీవో పరీక్షలను వాయిదావేసింది. ఈ పరీక్షలకు సంబంధించి మళ్లీ రీషెడ్యూల్ను విడుదల చేసింది. మరోవైపు ఈ వ్యవహారంలో కమిషన్ ఉద్యోగుల పాత్రపై నిగ్గుతేల్చేందుకు సిట్ను ఏర్పాటు చేసింది. దీంతోపాటు పరీక్షా విధానంలో సమూల మార్పులకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.
భవిష్యత్తులో ఎలాంటి తప్పులు జరగుకుండా పకడ్బందీ చర్యలు తీసుకొంటున్నది. ఇందులో భాగంగా ప్రత్యేకంగా పరీక్షల విభాగం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పరీక్షల విభాగం పర్యవేక్షణకు ఐఏఎస్ అధికారిని నియమించింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ అదనపు కార్యదర్శి హోదాలో ఎగ్జామినేషన్ కంట్రోలర్గా 2017 బ్యాచ్ ఐఏఎస్ అధికారి బీఎం సంతోష్ను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బీఎం సంతోష్ ఔటర్ రింగ్రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే, కమిషన్లో మరో 9 పోస్టులను భర్తీ చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది. డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, సీనియర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, జూనియర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, సీనియర్ ప్రోగ్రామర్, జూనియర్ ప్రోగ్రామర్, లా ఆఫీసర్ (జూనియర్ సివిల్ జడ్జి క్యాడర్) పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
ఆన్లైన్లో ఏఈఈ రాత పరీక్ష
టీఎస్పీఎస్సీ మరో కీలక నిర్ణయం తీసుకొన్నది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) సివిల్ పరీక్షను మే 21, 22 తేదీల్లో ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. 1,540 ఏఈఈ (సివిల్) ఉద్యోగాల భర్తీకి నిరుడు సెప్టెంబర్ 3న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. మే 21న ఓఎంఆర్ పద్ధతిలో పరీక్ష నిర్వహించనున్నట్టు గతంలో ప్రకటించింది. అయితే, టీఎస్పీఎస్సీలో ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో పరీక్షలన్నీ ఆన్లైన్లోనే నిర్వహించాలని భావిస్తున్నది. ఇందులో భాగంగా ఏఈఈ (సివిల్) పరీక్షను ఆన్లైన్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నది. మే 21, 22 తేదీల్లో రెండు షిఫ్టుల్లో ఆన్లైన్లో ఏఈఈ పరీక్షలు నిర్వహించనున్నారు. తుది స్కోరు ఖరారులో నార్మలైజేషన్ పద్ధతిని పాటించాలని కమిషన్ నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని పరీక్షలకు ఈ పద్ధతిని అమలు చేస్తుండటంతో అభ్యర్థుల్లోనూ ఎటువంటి గందరగోళం ఉండదని కమిషన్ భావిస్తున్నది.