శాయంపేట, జూన్ 29: గ్రామంలోని సర్కార్ బడిలో పిల్లలను చేర్పిస్తే తన సొంత ఖర్చులతో ఇంటి, నల్లా పన్నులు చెల్లిస్తానని హెచ్ఎం గ్రామస్తులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కొత్తగట్టుసింగారం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తోట రాజాయుగేంధర్ గ్రామ పంచాయతీలో సోమవారం జరిగిన గ్రామసభలో ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలను చేర్పించి మన బడిని మనమే కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు ఆంగ్లంలో బోధన జరుగుతుందని, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. బడిని బతికించుకునేందుకు హెచ్ఎం రాజాయుగేంధర్ చూపుతున్న చొరవను సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, ప్రజలు అభినందించారు.