హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): ఊపిరి ఉన్నంతవరకు తాను టీఆర్ఎస్లోనే ఉంటానని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య తెలిపారు. తనపై గిట్టనివారు చేసే ప్రచారం నమ్మవద్దని విజ్ఞప్తిచేశారు. సోమవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను షర్మిల భర్త బ్రదర్ అని కుమార్తో కలిసి ఉన్న పాత ఫొటోను సోషల్మీడియాలో వైరల్ చేసి పార్టీ మారుతున్నానని అసత్య ప్రచారాలు చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. వైఎస్ కుటుంబంతో తనకు వ్యక్తిగత పరిచయం ఉన్నదని, కానీ తెలంగాణకు వ్యతిరేకంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకొన్నప్పుడే ఆయనతో విభేదించానని గుర్తుచేశారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి తనకు రాజకీయంగా అవకాశం కల్పిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాజకీయ ఎదుగుదలకు అవకా శం ఇచ్చారని చెప్పారు. టీఆర్ఎస్లో తాను సంతృప్తిగా ఉన్నానని ప్రకటించారు. తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రిగా తనకు ఇష్టమైన వైద్యారోగ్యశాఖ మంత్రిగా అవకాశం కల్పించారని గుర్తుచేశారు. తా నెప్పుడూ సీఎం కేసీఆర్కు, పార్టీకి విధేయుడిగానే ఉంటానని స్పష్టంచేశారు. దళితజాతి ఉద్ధ్దరణ కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని ఊరూరా తిరిగి ప్రచారం చేస్తానని చెప్పారు.