Telangana | తనను గెలిపిస్తే ప్రజల సమస్యలపై పోరాడతానని నల్గొండ- వరంగల్- ఖమ్మం ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి అన్నారు. ప్రజల గొంతుకగా ప్రశ్నిస్తానని తెలిపారు. వరంగల్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం నాడు రాకేశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. విద్యావంతులు, మేధావులు భవిష్యత్ గురించి ఆలోచించి తీర్పు ఇవ్వాలని కోరారు. తెలంగాణ ప్రజలకు మంచి కోసం మేధావులు ఆలోచించి ఓటు వేయాలన్నారు.
దేశంలో చట్టసభలకు గొప్ప గొప్ప మేధావులు వెళ్లారని, ఇప్పుడు ద్రోహులు, బ్లాక్ మెయిలర్లు పోటీ చేస్తున్నారని రాకేశ్ రెడ్డి అన్నారు. ఉద్యోగులు ఎలాంటి బెదిరింపులు లేకుండా పనిచేయాలని, ప్రశాంతంగా ఎవరి వ్యాపారాలు వారు చేసుకోవాలని.., దీనికి కోసం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతు తెలుపాలని కోరారు. ప్రజల తరఫున ప్రశ్నించే వారెవరు? ప్రభుత్వానికి తొత్తులుగా మారెవారెవరు అనేది గ్రహించాలని సూచించారు. తాను రైతు బిడ్డనని, బిట్స్ పిలానీలో గోల్డ్ మెడలిస్టునని చెప్పారు. అమెరికాలో ఏడేండ్లు ఉద్యోగం చేశానని, పుట్టినగడ్డ రుణం తీర్చుకునేందుకు సేవ చేసేందుకు ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. అధికారం కోసం ఎప్పుడూ పాకులాడలేదని, ఒక ఆశయంతో వచ్చినట్లు చెప్పారు. బీజేపీలో ఉన్న కార్యకర్తలు కూడా తనతో పని చేశారని అన్నారు. తాను ఏ పార్టీలో పనిచేసినా ప్రజల పక్షాన ప్రజాసమస్యల కోసం పోరాడుతానని చెప్పారు. సమాజ భవిష్యత్ కోసం ఏ నాయకుడిని ఎన్నుకోవాలనేది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆలోచించాలని కోరారు.