హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు రూ.3.07 లక్షల కోట్లు ఖర్చవుతుందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. ఇందులో 6 గ్యారెంటీలకు రూ.2.15 లక్షల కోట్లు కాగా, మిగతా హామీలకు రూ.91 వేల కోట్ల ఖర్చు అవుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో హామీల అమలుకు ఎంత ఖర్చు అవుతుందో ప్రభుత్వం స్పష్టం చేయాలని, దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
గురువారం ఆయన శాసనసభలో మాట్లాడారు. ఆరు గ్యారంటీలకు రూ.53 వేల కోట్లు కేటాయించడం ద్వారా ఆర్థిక శాఖ మంత్రి విఫలమయ్యారని విమర్శించారు. ఇక ధరణిని కొనసాగిస్తారో.. లేదో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్, విదేశీ విద్యానిధి బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.