హైదరాబాద్: ఓటు (Vote) హక్కు వినియోగం, ఆవశ్యకతపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ‘నేను కచ్చితంగా ఓటు వేస్తాను’ (I Vote For Sure) అనే నినాదంతో కలెక్టర్ల ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో 5కే రన్ను నిర్వహించారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లో జీహెచ్ఎంసీ అధికారుల నేతృత్వంలో రన్ను ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో పోస్టాఫీస్ నుంచి సెంట్రల్ పార్క్ వరకు రన్ను నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కలెక్టర్ వినయ్ కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కలెక్టర్ ముజుమ్మిల్ ఖాన్, దాసరి మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.
మహబూబ్నగర్లోని స్టేడియంలో 5కే రన్ను జిల్లా కలెక్టర్ జీ. రవి నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. స్టేడియం గ్రౌండ్, అశోక్ థియేటర్ చౌరస్తా, పాత బస్టాండ్, తెలంగాణ చౌరస్తా మీదుగా తిరిగి స్టేడియం గ్రౌండ్కు రన్ చేరుకున్నది.
గద్వాలలో నిర్వహించిన 5కే రన్ను కలెక్టర్ వల్లూరు క్రాంతి ప్రారంభించారు. 18 ఏండ్లు నిండి ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించిన 5కే రన్లో కలెక్టర్, ఎస్పీ, పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. మంథనిలో జరిగిన కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ పుట్టా మధు, మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ, ఆర్డీవో హనుమ నాయక్ పాల్గొన్నారు.