హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీ బస్సుల్లో అమలు చేస్తున్న ఐ-టిమ్స్ (ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మిషన్లు) అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి. హైదరాబాద్, సంగారెడ్డి, నల్లగొండ, మెదక్, మహబూబ్నగర్, రంగారెడ్డి, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ రీజియన్లలోని ఏసీ, రిజర్వేషన్ సర్వీసుల్లో ఐ-టిమ్స్ను అందుబాటులోకి తెచ్చారు.
దీంతో ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం డిజిటల్ పేమెంట్లతోపాటు డెబిట్, క్రెడిట్ కార్డ్ల స్వైపింగ్కు మార్గం సుగమమైంది. ఐ-టిమ్స్ ఉన్న అన్ని రూట్లలో 40% టికెట్ల కొనుగోళ్లు ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నాయి. దశలవారీగా మిగిలిన సర్వీసుల్లోనూ ఐ-టిమ్స్ను తీసుకొచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఐ-టిమ్స్ను అందుబాటులోకి తెచ్చాక బస్సు బయలుదేరగానే ఆన్లైన్ బుకింగ్ ఆప్షన్ క్లోజ్ అవుతున్నది. దీంతో ప్రయాణికులకు ఎదురవుతున్న ఇబ్బందులను గ్రహించిన ఆర్టీసీ యాజమాన్యం కొత్త ఆప్షన్ను ప్రవేశపెట్టింది. ఫలితంగా ప్రయాణానికి ఐదు నిమిషాల ముందు కూడా టికెట్లు బుక్ చేసుకొనే సదుపాయం అందుబాటులోకి రావడంతోపాటు చిల్లర సమస్య కూడా పరిష్కారమైంది.