Jana Reddy | హైదరాబాద్, అక్టోబర్ 17(నమస్తే తెలంగాణ): ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు ఏదో అన్న చందంగా ఉన్నది కాంగ్రెస్ పరిస్థితి. ఆ పార్టీలో ఇంకా టికెట్ల పంచాయితీనే తెగలేదు.. అప్పుడే సీఎం పదవిపై లొల్లి మొదలైంది. అభ్యర్థుల పేర్లే ఇంకా పూర్తిగా ఖరారు కాలేదు. కానీ అప్పుడే సీఎం రేసులో నేనున్నానంటే.. నేనున్నానంటూ నేతలు రచ్చకెక్కుతున్నారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడితోపాటు పలువురు సీనియర్ నేతలు ఇప్పటికే తాము సీఎం రేసులో ఉన్నామని ప్రకటించుకోగా.. చాలా కాలం తరువాత మీడియా ముందుకొచ్చిన ఆ పార్టీ సీనియర్ జానారెడ్డి ‘నేను కూడా ఉన్నా’నని చెప్పుకున్నారు. ఆయన ఒక అడుగు ముందుకేసి తాను సీఎం పదవిని కోరుకోనని.. ఆ పదవే తనను కోరుకుంటుందని చెప్పారు. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలంలో మంగళవారం నాగార్జునసాగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, తన కుమారుడు జయవీర్రెడ్డితో కలిసి ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ సీఎం కావాలన్న తన అభిలాషను మరోసారి బయటపెట్టారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జానారెడ్డి సీఎం రేసులో ఉంటారా అని ప్రశ్నించగా.. ‘పదవుల రేసులో నేనెప్పుడూ లేను. పదవులే రేసులో ఉండి నన్ను అందుకుంటాయి’ అని వ్యాఖ్యానించారు. ‘ప్రజల హృదయాల్లో నేను సీఎం కావాలని ఉంది. సీఎం పదవి హఠాత్తుగా రావొచ్చేమో. ఒకవేళ ఏవైనా పదవులు వస్తే నేను కాదనను. నాకు సీఎం అయ్యేందుకు అన్ని అర్హతలూ ఉన్నాయి. 21 ఏండ్లకే రాజకీయాల్లోకి వచ్చిన, 36 ఏండ్లకే మంత్రినయ్యా, ఏ సీఎం చేయనన్ని శాఖలకు మంత్రిగా చేసినా’ అని చెప్పారు.
ఎమ్మెల్యేగా పోటీలో లేని మీరు సీఎం ఎలా అవుతారని ప్రశ్నించగా.. ‘ఆర్నెళ్ల సమయం ఉంటుంది. ఆ లోపు నా కొడుకు రాజీనామా చేస్తడు. నేను పోటీ చేసి ఎమ్మెల్యే అవుతా’ నంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా లేకున్నా పీవీ నర్సింహారావు ప్రధానమంత్రి కాలేదా అని ప్రశ్నించారు. సీఎం అనే ప్రజల చివరి కోరిక కూడా నాకు కూడా తెల్వకుండానే తీరవచ్చు’ అంటూ చెప్పుకొచ్చారు. దాంతో జానారెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. తాను అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకొంటానని చెప్పి కుమారుడిని రంగంలోకి దింపిన జానారెడ్డి… హఠాత్తుగా ఇలా మాట్లాడడం ఏంటన్న చర్చ మొదలైంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో సీఎం ఆశావహుల సంఖ్య భారీగా ఉన్న సంగతి తెలిసిందే. రేవంత్రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పలు సందర్భాల్లో తామూ సీఎం రేసులో ఉన్నామంటూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా జానారెడ్డి కూడా రేసులోకి రావడంతో కాంగ్రెస్ రాజకీయాలు మరింత రక్తికట్టించనున్నాయి.