హైదరాబాద్ : తన చివరి శ్వాస వరకు టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో కష్టపడి పని చేస్తాను అని ఆయన తేల్చిచెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులే టీఆర్ఎస్ పార్టీలో చేరి గౌరవం కాపాడుకోవాలన్నారు. అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు. ఈ పార్టీకి ధీటుగా పుట్టేవాడే లేడు.. పుట్టబోడు అని దానం నాగేందర్ పేర్కొన్నారు.
తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తప్పుడు కథనాలను ప్రచురించిన దిశ వెబ్సైట్, ఆర్బీసీ యూట్యూబ్ ఛానెల్పై హైదరాబాద్ సీపీకి దానం నాగేందర్ ఫిర్యాదు చేశారు. తప్పుడు కథనాలు ప్రసారం చేసిన ఈ రెండింటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.