అచ్చంపేట, నవంబర్ 20 : ‘నేను సీఎం కేసీఆర్ వదిలిన బాణం.. నన్ను చంపుతానని కొందరు రకరకాలుగా బెదిరిస్తున్నారు. నేను ఎవరికీ భయపడు’ అని నాగర్కర్నూల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్య వహారంలో బీజేపీ కుట్రను భగ్నం చేసిన తరువాత మొట్టమొదటి సారిగా ఆదివారం ఆయన అచ్చంపేటకు చేరుకోగా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. భారీ బైక్ర్యాలీ నిర్వహించారు.
అచ్చంపేట ప్రభుత్వ దవాఖాన నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు పూలబాటపై గువ్వల బాలరాజు దంపతులను నడిపించారు. అనంతరం గువ్వల మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి 8 రాష్ర్టాల్లో ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టి వారు గద్దెనెక్కారని ధ్వజమెత్తారు. తెలంగాణలో కూడా అలా చేయాలని చూసినా టీఆర్ఎస్ కర్రుకాల్చి వాత పెట్టిందన్నారు. తాను సీఎం కేసీఆర్ అడుగుజాడలో నడిచే వ్యక్తినని, ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా బీజేపీ కుట్రను తిప్పికొట్టినట్టు చెప్పారు. ఢిల్లీ గడ్డను గడగడలాడించి అచ్చంపేటలో అడుగుపెట్టానని గర్వంగా చెప్పారు.