హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్ట్ 26 (నమస్తే తెలంగాణ) : నిలువనీడ లేకుండా హైడ్రా సృష్టించిన విధ్వంసం ఇంకా కండ్ల ముందు కదలాడుతున్నా.. ప్రభుత్వం మాత్రం బాధితులను వదలడం లేదు. రెండేండ్ల క్రితం సున్నంచెరువు ప్రాంతంలో కూల్చేసిన ఇండ్లకు కూడా కరెంటు, ఆస్తి పన్ను, నల్లా పన్నుల పేరుతో నిలువుదోపిడీ చేస్తున్నది. సున్నంచెరువు బఫర్, ఎఫ్టీఎల్లో కట్టారంటూ మాదాపూర్లోని గుట్టల బేగంపేటకు చెందిన సర్వే నంబర్లు 12,13లో 2024 సెప్టెంబర్లో హైడ్రా వీరి ఇండ్లు, షెడ్లు కూల్చివేసింది. కానీ వారికి ఇల్లు లేకున్నా ఆస్తి పన్ను, ప్లాట్ వద్ద మీటర్ లేకపోయినా కరెంట్ బిల్లులు, నల్లా పన్నులు ఇస్తూ మున్సిపల్ సిబ్బంది ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.
కూల్చివేతల సమయంలో అక్కడ ఉన్న కరెంట్ మీటర్లు తీసుకెళ్లిన విద్యుత్ సిబ్బంది ఈ మీటర్లకు బిల్లులెందుకు వేస్తున్నారనే విషయాన్ని మాత్రం బాధితులకు చెప్పడం లేదు. హైడ్రా కూల్చివేసినప్పటి నుంచి నేటివరకు హైకోర్టులో దీనిపై ప్లాట్ల యజమానులు పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్లాట్లలో హైడ్రా ఎలాంటి పనులు చేయవద్దంటూ కోర్టు స్టే విధించింది. కానీ హైడ్రా మాత్రం వీరి ప్లాట్లలో సున్నంచెరువు పనులు పూర్తిచేస్తూ తాము కేవలం చెరువులోనే పనిచేస్తున్నామని హైకోర్టుకు చెప్పినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. ఒకవైపు ఇండ్లు పోయి మరోవైపు తాము కష్టపడి కొనుక్కున్న ప్లాట్లు చెరువుపాలై ఇంకోవైపు లేని ఇండ్ల, మీటర్లకు బిల్లులు కట్టుకుంటూ తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.