హైదరాబాద్, మార్చి 02 (నమస్తే తెలంగాణ) : ప్రపంచవ్యాప్తంగా హరిత ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే సమయం ఆసన్నమైందని యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ పేర్కొన్నారు. గ్రీన్ ఎకానమీలో భాగంగా భారతదేశ మహిళా పారిశ్రామికవేత్తలకు యూఎస్ మిషన్ నుంచి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
గురువారం హైదరాబాద్లో నిర్వహించిన బాల వికాస సెంటర్ ఫర్ సోషల్ అండ్ రెస్పాన్సిబుల్ బిజినెస్ చివరి వర్క్షాప్లో ఆమె మాట్లాడుతూ, వాతావరణం, పర్యావరణ సవాళ్లను అధిగమించేందుకు వినూత్న మార్గాల్లో పరిష్కారం చూపే వారి కోసం దేశవ్యాప్తంగా వర్క్షాప్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. పునరుత్పాదక ఇంధనం, కాలుష్యం తగ్గించే సాంకేతిక సాధనాలు, ఇంధన ఆదా పరికరాలు, ఉద్గారాల నియంత్రణ యంత్రాల వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు దేశవ్యాప్తంగా 40 మంది మహిళా పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇచ్చామని వివరించారు. అనంతరం క్యాప్ స్టోన్ ఈవెంట్ కోసం కొందరు మహిళా పారిశ్రామిక వేత్తలను ఎంపిక చేశారు.