హైదరాబాద్: హైదరాబాద్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో జంట జలాశయాలకు వరద ప్రవాహం పోటెత్తింది. ఈ నేపథ్యంలో అధికారులు రెండు చెరువుల నుంచి మూసీ నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ నాలుగు గేట్లు ఎత్తి 1,400 క్యూసెక్కులు, ఉస్మాన్సాగర్ 4 గేట్లు ఎత్తి 960 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
తూర్పు నుంచి వీస్తున్న గాలులకు క్యుములోనింబస్ మేఘాలు తోడవడంతో శుక్రవారం రాత్రి గ్రేటర్ హైదరాబాద్లో కుండపోత వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉక్కపోతతో వేడెక్కిన నగరంపై రాత్రి వాన దంచికొట్టింది. టీఎస్డీపీఎస్ అధికారుల సమాచారం ప్రకారం.. శుక్రవారం రాత్రి 10 గంటల వరకు సరూర్నగర్ మండలంలోని లింగోజిగూడలో అత్యధికంగా 10.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సైదాబాద్లోని కుర్మగూడలో 10 సెం.మీ., హయత్నగర్లోని హస్తినపురంలో 8.83 సెం.మీ., అస్మాన్ఘడ్లో 8.7 సెం.మీ., చార్మినార్లోని సర్దార్మహల్లో 8.6 సెం.మీ., రాజేంద్రనగర్లో 6.9 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి.