హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరం హైపర్ టెన్షన్కు కేంద్రంగా మారుతున్నది. నగరవాసులు నిత్యం ఉరుకుల పరుగుల జీవనం సాగిస్తూ, తీవ్ర ఒత్తిడికి లోనవుతూ బీపీలు తెచ్చుకొంటున్నట్టు వైద్యశాఖ సర్వేల్లో తేలింది. రాష్ట్రంలో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) పరిస్థితిని తెలుసుకొనేందుకు వైద్యారోగ్యశాఖ ఇటీవల స్క్రీనింగ్ ప్రారంభించింది. రాష్ట్రంలోని 3.71 కోట్ల మందికి స్క్రీనింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. మార్చి నాటికి కోటి మందికి స్క్రీనింగ్ పూర్తయింది. స్క్రీనింగ్లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. హైదరాబాద్లో సుమారు 25 శాతం మంది బీపీతో బాధపడుతున్నట్టు తేలింది.
రాష్ట్రవ్యాప్త సగటు 13 శాతం ఉండగా, రాజధానిలో రెట్టింపు ఉండటం గమనార్హం. హైదరాబాద్ జిల్లా పరిధిలో 6.30 లక్షల మందికి స్క్రీనింగ్ చేయగా.. ఇందులో 1.56 లక్షల మందికి బీపీ ఉన్నట్టు తేలింది. రాజధానిలో మధుమేహ బాధితులు సుమారు 8 శాతం ఉన్నట్టు వెల్లడైంది. ఎన్సీడీ జబ్బుల అనుమానిత లక్షణాలు ఉన్నవారు 21 శాతం మంది ఉన్నారు. వీరి పరీక్ష ఫలితాలు వస్తే బాధితుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదమున్నది.
ప్లానింగ్ విభాగం నివేదికలోనూ..
2019-20 సంవత్సరానికి సంబంధించి వివిధ ప్రభుత్వ సర్వేల్లో తేలిన అంశాలతో ఒక నివేదికను తాజాగా రాష్ట్ర ప్రణాళిక విభాగం విడుదల చేసింది. ఇందులోనూ హైదరాబాద్లో దాదాపు 20 శాతం మందికి షుగర్, 40 శాతం మందికి బీపీ ఉన్నట్టు తేలింది. ఇక 15 ఏండ్లు దాటినవారిలో సుమారు సగం మంది అధిక బరువుతో ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది.
షుగర్కు డబుల్ బీపీ
మూడు సమస్యలు.. మూడు మార్గాలు
సమాజంలో బీపీ, షుగర్, గుండె సంబంధిత సమస్యలు పెరగటానికి మూడు కారణాలున్నాయి. వాటిని నియంత్రించాలన్నా మూడు మార్గాలున్నాయి. 1, రోజూ కనీసం 30-60 నిమిషాలు చెమట పట్టేలా వ్యాయామం, వాకింగ్ చేయాలి. షటిల్, క్రికెట్ వంటి ఆటలు ఆడొచ్చు. 2, ఆహార నియమాలు పాటించాలి. కార్బోహైడ్రేట్లు తక్కువగా, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. 3, మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ధ్యానం చేయాలి. ఇది మానసిక సంఘర్షణల నుంచి రక్షిస్తుంది.
-డాక్టర్ ఏ శరత్రెడ్డి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్