న్యూఢిల్లీ, డిసెంబర్ 5: తెలంగాణ రాజధాని హైదరాబాద్ సురక్షితమైన నగరంగా నిలిచింది. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో చాలా తక్కువగా నేరాలు నమోదవుతున్నట్టు జాతీయ నేర గణాంకాల సంస్థ(ఎన్సీఆర్బీ) వెల్లడించింది. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన సురక్షిత నగరాల జాబితాలో హైదరాబాద్ దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. ఈ లిస్టులో పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతా, మహారాష్ట్రలోని పుణె నగరాలు మొదటి, రెండు స్థానాల్లో నిలిచాయి. మహా నగరాల్లో ప్రతి లక్ష జనాభాకు జరుగుతున్న సగటు నేరాల సంఖ్య ఆధారంగా ఎన్సీఆర్బీ ఈ సురక్షిత నగరాల జాబితాను ప్రకటించింది. ఐపీసీ సెక్షన్లతో పాటు ప్రత్యేక, స్థానిక చట్టాల కింద నమోదైన నేరాలను ఇందులో పరిగణనలోకి తీసుకొన్నారు.
ఈ గణాంకాల ప్రకారం 2022లో కోల్కతాలో ప్రతి లక్ష జనాభాకు సగటున 86.5 కేసులు నమోదయ్యాయి. పుణెలో 280.7, హైదరాబాద్లో 299.2 కేసులు నమోదైనట్టు నివేదిక వెల్లడించింది. 20 లక్షలకు పైగా జనాభా ఉన్న 19 నగరాల్లో నమోదైన కేసులను పరిగణనలోకి తీసుకొన్న ఎన్సీఆర్బీ ఈ ర్యాంకులు ఇచ్చింది. అయితే కోల్కతాలో మహిళలపై జరిగిన నేరాలు 2021తో(1,783 కేసులు) పోల్చితే 2022లో(1,890 కేసులు) పెరిగాయి. మహిళలపై నేరాల రేటు ఈ నగరంలో ప్రతి లక్ష జనాభాకు 27.1గా నమోదైంది. 11 రేప్ కేసులు, 34 హత్య కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో తగ్గిన మర్డర్లు
తెలంగాణ పోలీసులు తీసుకుంటున్న పటిష్టమైన చర్యల వల్ల రాష్ట్రంలో మర్డర్ల సంఖ్య భారీ గా తగ్గుముఖం పట్టింది. కఠినమైన చర్యలు, వేగవంతమైన దర్యాప్తు, కఠిన శిక్షలు, చేపడుతున్న అవగాహన కార్యక్రమాల వల్ల ఏటా హత్యలు తగ్గుతున్నాయి. 2021తో పోల్చితే.. 2022లో హత్యల రేటు 12.5 శాతం తగ్గింది. ఎన్సీఆర్బీ ప్రకారం 2021లో 1,026 హత్య కేసులు నమోదవగా గత ఏడాది ఆ సంఖ్య 937కు తగ్గింది. ఈ హత్య కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు పడేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. వీటితో పాటు రైల్వేలో జరిగే నేరాలు కూడా తెలంగాణలో పూర్తిస్థాయిలో అదుపులో ఉన్నట్లు ఎన్సీఆర్బీ తెలిపింది. గుజరాత్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాల్లో రైల్వే నేరాల సంఖ్య ఏటా పెరుగుతున్నది. మహారాష్ట్రలో 2022లో 1,46,621 కేసులు నమోదుకాగా.. తెలంగాణలో 10,863 కేసులు మాత్రమే నమోదయ్యాయి.