బంజారాహిల్స్,ఫిబ్రవరి 22: కిడ్నీ ట్రాన్స్ఫ్లాంటేషన్ కోసం కుటుంబంలోని దాతలు సిద్ధంగా ఉన్నప్పటికీ, బ్లడ్గ్రూప్ మ్యాచ్ కాకపోవడంతో రోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారని… ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేవలం 3-5 శాతం మందికి మాత్రమే అందుబాటులో ఉన్న కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలను ఏకంగా 40 శాతం వరకు తీసుకువెళ్లేందుకు ‘పెయిర్డ్ కిడ్నీ డొనేషన్( పీకేడీ)’ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నామని స్టార్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ గోపీచంద్ మన్నెం చెప్పారు. బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని స్టార్ ఆస్పత్రిలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జీవన్దాన్ ఫౌండేషన్ సీఈవో డా.స్వర్ణలత, స్టార్ ఆస్పత్రి నెఫ్రాలజీ విభాగాధిపతి డా.గంధె శ్రీధర్తో కలిసి ‘కిడ్నీ స్వాప్ ట్రాన్స్ఫ్లాంట్స్’ విధానంలో భాగంగా దాతలు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కోసం ప్రత్యేకంగా వెబ్సైట్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పీకేడీ విధానం కిడ్నీ రోగులకు వరప్రదాయిని అని అభివర్ణించారు.
భారత్లో యేటా సుమారు 2 లక్షల మందికి కిడ్నీ మార్పిడి అవసరమవుతుండగా కేవలం 8 నుంచి 10వేల మందికి మాత్రమే కిడ్నీ మార్పిడి అవకాశం లభిస్తున్నదని తెలిపారు. కుటుంబ సభ్యులు కిడ్నీ దానం చేసేందుకు సిద్ధపడినా… బ్లడ్ గ్రూప్లు కలవకపోవడంతో మార్పిడి చేయడం సాధ్యం కావడం లేదని చెప్పారు. దీంతో ఎన్నో ఏళ్లపాటు డయాలసిస్ మీదనే వారు జీవితాన్ని గడపాల్సి వస్తున్నదని తెలిపారు. దీనికి తోడు మధుమేహం, పోషకాల కొరత, అతి తక్కువ శానిటేషన్ వంటి కారణాలతో రోగం కాస్త క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ)గా మారుతున్నదని, దేశంలో దాదాపు 17 శాతం మందిని సీకేడీ వేధిస్తున్నదని వెల్లడించారు. ఇది తీవ్రతరమై చివరకు ‘అంత్యదశ మూత్రపిండాల వ్యాధి (ఎండ్స్టేజ్ రెనల్ డిసీజ్)’కి దారి తీస్తున్నదని గోపీచంద్ తెలిపారు.
కిడ్నీ రోగుల ప్రాణాలను కాపాడేందుకే ‘పెయిర్డ్ కిడ్నీ డొనేషన్ (పీకేడీ)’అని అందుబాటులోకి తీసుకువచ్చామని డాక్టర్ గోపిచంద్ తెలిపారు. కిడ్నీ పెయిర్డ్ డొనేషన్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవడం ద్వారా ఒకే బ్లడ్ గ్రూప్ కలిగిన వేర్వేరు కుటుంబాల్లోని దాతలతో కలుసుకుని తమ వారికి విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేసుకునే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. ఈ విధానం దేశంలో మూత్రపిండాల మార్పిడిలో అనేక విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందని గోపీచంద్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జీవన్ దాన్ ఇన్చార్జి డా.స్వర్ణలత మాట్లాడుతూ… అవయవ దానంపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నదని, ప్రస్తుతం అవయవదానంపై ప్రజల్లో కొంతమార్పు వచ్చిందన్నారు. స్టార్ ఆస్పత్రిలో ప్రవేశపెట్టిన పీకేడీ విధానంతో వందలాది మందికి కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా రెండు నెలల కిందట పీకేడీ విధానం ద్వారా కిడ్నీ మార్పిడి చేయించుకున్న రఘునాథరెడ్డి, మహేశ్వర్రెడ్డి కుటుంబసభ్యులు తమ అనుభవాలను పంచుకున్నారు.