టీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న 43,373 మంది ఉద్యోగులు, కార్మికులు గురువారం నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోయారు. ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. నెల రోజులుగా నానుతున్న ఈ బిల్లుకు ఆమోదం తెలుపుతూ రాజ్భవన్ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. బిల్లులోని కొన్ని అంశాలపై లేవనెత్తిన సందేహాలకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలతో సంతృప్తి చెంది బిల్లుపై సంతకం పెట్టినట్టు గవర్నర్ పేర్కొన్నారు. బిల్లు ఆమోదం పొందటంతో ఆర్టీసీ ఉద్యోగులు సంబురాలు చేసుకొంటున్నారు. తమకు మంచిరోజులు వచ్చాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల చిరకాల కల ఫలించింది. టీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న 43, 373 మంది ఉద్యోగులు, కార్మికులు గురువారం నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా అధికారికంగా మారిపోయారు. ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లుకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. నెలరోజులుగా నానుతున్న ఈ బిల్లుకు ఆమోదం తెలుపుతూ రాజ్భవన్ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. బిల్లులోని కొన్ని అంశాలపై లేవనెత్తిన సందేహాలకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలతో సంతృప్తి చెందిన బిల్లుపై సంతకం పెట్టినట్టు గవర్నర్ పేర్కొన్నారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు సంబురాలు చేసుకొంటున్నారు. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న తమకు మంచిరోజులు వచ్చాయని ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఇందుకు కారణమైన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, గవర్నర్ తమిళిసై, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్మికుల జీవితాల్లో వెలుగు
రోడ్డురవాణా సంస్థ ప్రజల రోజువారీ జీవితాలతో 60 ఏండ్లుగా విడదీయలేనంతగా పెనవేసుకొని పోయింది. నిత్యం లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తూ రాష్ట్ర ప్రగతికి రథచక్రంలా దోహదపడుతున్నది. సంస్థలోని ఉద్యోగులు, కార్మికులు రాత్రిపగలన్న తేడా లేకుండా శ్రమిస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారు. వీరి కష్టాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. సంస్థ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. గత అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే సమయంలో కొంత గందరగోళం నెలకొన్నది. అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతించకపోవడంతో ఆర్టీసీ కార్మికులు నిరసన వ్యక్తంచేశారు. దీనితో హుటాహుటిన పాండిచ్చేరి నుంచి గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్లో కార్మిక సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు. బిల్లులో కొన్ని అంశాలపై గవర్నర్ సందేహాలు వ్యక్తంచేస్తూ ప్రభుత్వాన్ని వివరణ కోరారు. వెంటనే స్పందించిన ప్రభుత్వం, వివరణ ఇవ్వడంతో బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆ తర్వాత కూడా బిల్లులోని కొన్ని అంశాలపై గవర్నర్ సందేహాలు వ్యక్తంచేశారు. ఆర్టీసీ విభజన, కార్మికుల జీతభత్యాలు, ఉద్యోగ భద్రత, ఫించన్లు వంటి ఐదు ప్రధాన అంశాలపై మరిన్ని వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. వాటికి సమాధానమిస్తూ సీఎస్ శాంతికుమారి గవర్నర్కు వివరంగా లేఖ రాశారు. సీఎస్ సమాధానాలతో సంతృప్తి చెందని రాజ్భవన్, మరో 6 అంశాలను అదనంగా జోడిస్తూ.. సమాచారం కావాలని కోరింది. వాటన్నింటికీ ప్రభుత్వం వివరణ ఇవ్వడంతో బిల్లుపై గవర్నర్ సంతకం పెట్టారు.
కరోనాతో ఇబ్బంది కలిగినా..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆర్టీసీ నష్టాలను పూడ్చుకొంటూ క్రమంగా లాభాల్లోకి తెచ్చే క్రమంలో కరోనా దెబ్బకొట్టడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా సీఎం కేసీఆర్ వెనుకడుగు వేయలేదు. వేలమంది ఉద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్నందున ఆర్టీసీని ఆదుకొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కీలకపాత్ర పోషించారు. ఉద్యమ చరిత్రలో మైలురాయిగా నిలిచిన సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. జీతాలు లేక ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఉద్యమాన్ని వీడలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చి వేతనాలు పెంచింది. సంస్థ మనుగడకు రూ.వెయ్యి కోట్లు కేటాయించి భరోసా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించి ఆ మేరకు చర్యలు చేపట్టింది. ఎట్టకేలకు ప్రభుత్వ సంక్పలం ఫలించి ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులయ్యారు.
ఆర్టీసీ కార్మికులకు శుభాకాంక్షలు
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును గవర్నర్ ఆమోదించటం శుభపరిణామం. నా ఆర్టీసీ కార్మికులకు, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు. ఇది సీఎం కేసీఆర్ ఇచ్చిన బహుమతి. మీ చిరకాల వాంఛను కేసీఆర్ నెరవేర్చారు. ఇక నుంచి ఆర్టీసీ కార్మికులు కాదు.. వాళ్లు ప్రభుత్వ ఉద్యోగులు. ఇన్ని రోజులు పెండింగ్లో పెట్టినప్పటికీ ఆమోదం లభించింది. ధర్మం గెలుస్తుందనడానికి ఇదే నిదర్శనం. నాటి పాలకులు ఆర్టీసీని అడ్రస్ లేకుండా చేయాలని కుట్రలు పన్నారు. మా ప్రభుత్వం ఆర్టీసీకి, కార్మికులకు పట్టం కట్టింది. ప్రభుత్వ ఉద్యోగులను చేసింది.
– తన్నీరు హరీశ్రావు, ఆర్థిక మంత్రి
సీఎం కేసీఆర్కు, ప్రభుత్వానికి రుణపడి ఉంటాం
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటాం. 43,373 మంది ఉద్యోగులు, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం దేశ చరిత్రలోనే సాహసోపేతమైన నిర్ణయం. ఉమ్మడి రాష్ట్రంలో నష్టాల ఊబిలో చిక్కుకున్న ఆర్టీసీని స్వరాష్ట్రంలో అన్ని రకాలా ఆదుకుంటూ వస్తున్న సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు. ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నిండేందుకు కృషిచేసిన గవర్నర్ తమిళిసై, మంత్రులు హరీశ్రావు, కేటీఆర్, అజయ్, ఎమ్మెల్సీ కవిత, ఆర్టీసీ చైర్మన్ గోవర్ధన్, ఎండీ సజ్జనార్కు కృతజ్ఞతలు. కేంద్రం ఆర్టీసీని ప్రైవేటీకరించే కుట్రలో భాగంగానే 2019 నూతన రవాణా చట్టం తెచ్చి ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని చూసింది. స్వరాష్ట్రంలో ఆర్టీసీకి మొదటి దఫాలో రూ.500 కోట్లు, మరోసారి రూ.1,500 కోట్లతోపాటు బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించి ఉద్యోగులకు జీతాలు చెల్లించాం. కరోనా సమయంలో ఒక్క బస్సు కూడా తిరగకపోయినా ఉద్యోగులకు జీతాలు అందించి ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్దే.
– థామస్రెడ్డి, టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కేసీఆర్కు అండగా ఉంటాం
ఆర్టీసీ విలీన బిల్లు ఎట్టకేలకు ఆమోదం పొందడంతో సంస్థ ఉద్యోగులు, కార్మికులకు ఆనందంగా ఉన్నారు. కార్మికుల కలను నెరవేర్చిన సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై, మంత్రులు హరీశ్రావు, కేటీఆర్, పువ్వాడ అజయ్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్కు కృతజ్ఞతలు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు ఆర్టీసీ ఉద్యోగులు అండగా ఉంటాం.
– ఏఆర్రెడ్డి, టీఎంయూ అధ్యక్షుడు
సాహసోపేత నిర్ణయం
ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడం సీఎం కేసీఆర్ తీసుకొన్న సాహసోపేత నిర్ణయం. బిల్లు గురించి స్వయంగా గవర్నర్ను కలిసి చర్చించడం ఆర్టీసీ పట్ల, కార్మికుల పట్ల ఆయనకు ఉన్న అభిమానానికి నిదర్శనం. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులు అయ్యేందుకు కృషిచేసిన సీఎం కేసీఆర్కు, గవర్నర్ తమిళిసైకి కృతజ్ఞతాభినందనలు.
– ఎన్ కమలాకర్ గౌడ్, టీఎంయూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
సీఎం, గవర్నర్కు థ్యాంక్స్
ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల న్యాయమైన కోరికను నెరవేర్చిన సీఎం కేసీఆర్, అందుకు సహకరించిన మంత్రులకు ధన్యవాదాలు. బిల్లును ఆమోదించడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన గవర్నర్కు ప్రత్యేక కృతజ్ఞతలు. ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి, వారి కుటుంబాల్లో వెలుగులు నింపిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి యావత్ ఆర్టీసీ కార్మికులు రుణపడి ఉంటారు.
– బీ యాదయ్య, టీఎంయూ ముఖ్య సలహాదారు