హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 29(నమస్తే తెలంగాణ): పాస్పోర్టు జారీ ప్రక్రియలో దళారీ జోక్యాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా మార్పులు తేనున్నట్టు హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి స్నేహజ తెలిపారు. ఈ ఏడాది పాస్పోర్ట్ సేవలపై ఆమె సికింద్రాబాద్లోని ఆర్పీవో కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
పాస్పోర్ట్ జారీ వ్యవహారంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని, ఒక్క డిసెంబర్లోనే పదుల సంఖ్యలో ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో అధికారుల పాత్ర ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పాస్పోర్టుల జారీలో తెలంగాణ దేశంలోనే ఐదో స్థానంలో ఉందన్నారు. ఈ ఏడాది 7,85,485 పాస్పోర్టులు జారీ చేశామని తెలిపారు. జనన ధ్రువీకరణ కోసం ఆధార్ కార్డును పరిగణనలోకి తీసుకోవడం లేదని చెప్పారు. దానికి బదులుగా ఎస్సెస్సీ మెమో, పాన్కార్డు, ఓటర్ కార్డు ఇతర గుర్తింపు కార్డులను జతచేయాలని స్పష్టంచేశారు.