కోచింగ్ సెంటర్ల నిర్వాహకులే రెచ్చగొట్టారు
46 మంది అరెస్టు.. వాళ్లంతా తెలంగాణవారే
దెబ్బతిన్న 58 కోచ్లు.. నేరం రుజువైతే యావజ్జీవం
ఆందోళనకారులపై కాల్పులు జరిపింది ఆర్పీఎఫ్ఫే
సికింద్రాబాద్ ఘటనపై రైల్వే పోలీసుల వివరణ
హైదరాబాద్ సిటీబ్యూరో/ఈస్ట్మారేడ్పల్లి, జూన్ 19 (నమస్తే తెలంగాణ): అగ్నిపథ్ ప్రకటనతో ఉద్యోగం రాదనే బాధతోనే ఆర్మీ అభ్యర్థులు శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళన చేపట్టారని రైల్వే ఎస్పీ అనురాధ తెలిపారు. కేంద్ర ఆస్తులను ధ్వంసం చేస్తేనే తమ ఆవేదన తెలుస్తుందన్న ఉద్దేశంతో.. రైల్వే స్టేషన్ బ్లాక్, ఇండియన్ ఆర్మీ, హకీంపేట్ ఆర్మీ స్టేషన్, చలో సికింద్రాబాద్ ఈఆర్వో 3, ఆర్మీ జీడీ 2021 మార్చ్ ర్యాలీ, సీఈఈ సోల్జర్స్, సోల్జర్ టు డై పేర్లతో యువకులు గ్రూప్లు తయారు చేశారని వివరించారు. ఆయా గ్రూప్లలో చర్చించుకొని రైల్వే స్టేషన్లోకి చొరబడి విధ్వంసం సృష్టించారని వెల్లడించారు. ఆదివారం మీడియాతో ఘటన వివరాలు వెల్లడించిన ఆమె.. బీహార్లో ఆందోళనలు జరిగాయని, ఇదే పంథాను అనుసరించాలని అభ్యర్థులను కోచింగ్ సెంటర్ల నిర్వాహకులే రెచ్చగొట్టారని తెలిపారు. రైల్వే స్టేషన్లో దాడులకు పాల్పడి, రైల్వే ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై 143, 147, 324, 307, 435, 427, 448, 336, 332, 341 రెడ్విత్ 149 ఐపీసీలతో పాటు సెక్షన్ 150, 151, 152, ఆఫ్ రైల్వే యాక్ట్, సెక్షన్ 3 అండ్ 4 ఆఫ్ పీడీపీపీ యాక్ట్ల ప్రకారం కేసులు నమోదు చేశామని వెల్లడించారు.
ఇప్పటి వరకు 46 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. అరెస్టయినవాళ్లంతా తెలంగాణవారేనని, నిందితులకు యావజ్జీవ శిక్షలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. ఆర్మీ అభ్యర్థులను రెచ్చగొట్టిన కోచింగ్ సెంటర్లను గుర్తించామని, నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకొంటామని స్పష్టం చేశారు. రైల్వే స్టేషన్లోకి చొరబడటం కూడా నేరమేనని, అలాంటివారికి రెండేండ్ల వరకు జైలు శిక్ష పడుతుందని వివరించారు. భవిష్యత్తులో వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా రావని చెప్పారు. ఘటనలో ఆర్పీఎఫ్ఫే కాల్పులు జరిపిందని పేర్కొన్నారు. మొత్తంగా 58 కోచ్లు దెబ్బతిన్నాయని, రూ.12 కోట్ల నష్టం వాటిల్లిందని డివిజన్ సీనియర్ సెక్యూరిటీ కమిషనర్ సుధాకర్ వెల్లడించారు.