హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): నకిలీ పత్రాలు సృష్టించి రి టైర్డు ఐఏఎస్ అధికారి భన్వర్లాల్ ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారన్న కేసులో తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి నవీన్కుమార్ భట్తోపాటు అతని సోదరుడు సాంబశివరావు, ఆయన భార్య రూపా డింపుల్ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాల్లో కెళ్తే.. ఉద్యోగ విరమణకు ముందు ఓల్డ్ అల్వాల్లో కిరాయి ఇంట్లో నివసించిన భన్వర్లాల్కు జూబ్లీహిల్స్లోని ప్రశాసస్నగర్లో సొం త ఇల్లు ఉన్నది. ఆ ఇంటిని సాంబశివరావుకు కిరాయికి ఇస్తూ 2014 నవంబర్లో ఒప్పందం చేసుకున్నారు.
2019లో ఉద్యోగ విరమణ అనంతరం భన్వర్లాల్ కిరాయి ఇంటిని ఖాళీ చేసి, ప్రశాసస్నగర్లోని సొంత ఇంటిలో నివసించాలని నిశ్చయించుకున్నారు. అందుకోసం ఆ ఇంటిని ఖాళీ చేసి తనకు అప్పగించాలని సాంబశివరావును కోరాడు. త్వరలోనే ఖాళీ చేస్తానని చెప్పిన సాంబశివరావు.. 2020 జనవరి నుంచి కిరాయి కట్టడం మానేశాడు. సాంబశివరావు గురించి భన్వర్లాల్ ఆరా తీయడంతో అతని సోదరుడు నవీన్కుమార్ భట్ కూడా అదే ఇంటిలో ఉంటున్నట్టు తేలింది. దీంతో తన ఇంటిని ఖాళీ చేస్తారా? లేదా? అంటూ భన్వర్లాల్ గట్టిగా మాట్లాడటంతో కిరాయి బకాయి కింద సాంబశివరావు రూ.11.10 లక్షలకు మూడు పోస్టు డెటేడ్ చెక్కులను ఇచ్చాడు. ఆ చెక్కులను భన్వర్లాల్ బ్యాంకులో డిపాజిట్ చేయగా.. అవి బౌన్స్ అయ్యాయి.
పథకం ప్రకారమే తనను ఇబ్బంది పెడుతున్నారని గుర్తించి కోర్టును ఆశ్రయించిన భన్వర్లాల్.. మరోసారి సాంబశివరావుకు ఫోన్చేసి ఇల్లు ఖాళీ చేయాలని కోరినా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత నకిలీ పత్రాలు సృష్టించిన సాంబశివరావు, నవీన్కుమార్.. ఆ ఇంటిని భన్వర్లాల్ తమకు 20 ఏండ్లు లీజుకు ఇచ్చారంటూ సివిల్ వివాదాన్ని సృష్టించారు. దీనిపై భన్వర్లాల్ తన భార్య మణిలాల్తో కలిసి గత నెల 17న అప్పటి సీపీకి ఫిర్యాదు చేయగా, ఈ నెల 22న సాంబశివరావు, రూపా డింపుల్ను అరెస్టు చేసిన పోలీసులు.. బుధవారం నవీన్కుమార్ను సీసీఎస్కు పిలిపించి విచారణ జరిపారు. అనంతరం ఆయనకు నోటీసులు జారీ చేశారు.
నవీన్కుమార్ గతంలో ఏపీలోని పార్వతీపురం, రంపచోడవరం, విజయనగరం, తూర్పు గోదావరి, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో పనిచేసినప్పుడు పలు వివాదాల్లో చిక్కుకున్నాడు. ప్రభుత్వ వాహనాలను సొంత పనులకు వాడుకోవడం, కిందిస్థాయి సిబ్బందిని వేధించడం, వారితో వెట్టిచాకిరీ చేయించడంలాంటి ఆరోపణలతో సస్పెన్షన్కు, బదిలీలకు గురయ్యాడు.