హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (టీఎస్టీడీసీ) శనివారం నుంచి హైదరాబాద్-భద్రాచలం-పాపికొండలకు ప్రత్యేక టూర్ను ప్రారంభించింది. మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీలో తొలిరోజు సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్లోని బషీర్బాగ్ పర్యాటక భవన్ నుంచి బస్సు బయలుదేరి మరునాడు ఉదయం 5 గంటలకు భద్రాచలం చేరుకుంటుంది. అక్కడ హరిత హోటల్లో అల్పాహారం చేశాక 7.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 9.30 గంటలకు పోచారం బోటింగ్ పాయింట్ వెళ్తుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాపికొండలు, పేరంటాళ్లపల్లికి బోటింగ్ ఉంటుంది. లంచ్, స్నాక్స్ బోట్లోనే అందజేస్తారు. సాయంత్రం 5 గంటలకు తిరిగి భద్రాచలం హరిత హోటల్కు తీసుకెళ్తారు. మూడోరోజు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో భద్రాద్రి ఆలయ దర్శనం ఉంటుంది. 1.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పర్ణశాల చూపిస్తారు. 2:30 గంటలకు బస్సు బయలుదేరి రాత్రి 10:30 గంటలకు హైదరాబాద్కు చేరుకుంటుంది. ఈ టూర్కు పెద్దలకు రూ.4,999, పిల్లలకు రూ.3,999 చార్జి ఉంటుందని టీఎస్టీడీసీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా తెలిపారు.