హైదరాబాద్ః తెలంగాణలో ఏ ఎన్నిక వచ్చినా, యావత్ సమాజం కేసీఆర్ వెంటే ఉంటుందని మునుగోడు విజయంతో మరోసారి రుజువైందని టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. మొదటి రౌండ్ నుంచి మంచి ఆధిక్యాన్ని ప్రదర్శించి విజయకేతనం ఎగురవేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి అభినందనలు తెలిపారు ఎంపీ. మునుగోడు ఎన్నిక ఫలితం తర్వాత ఒక ఒక ప్రకటన విడుదల చేసిన నామా మునుగోడులో ఓటర్లు ప్రజాస్వామ్యాన్ని అందలం ఎక్కించారని ప్రత్యర్థి పార్టీపై టీఆర్ఎస్ ధర్మ పోరాటం చేసి విజయదుందుభి మోగించిందని అన్నారు. సీఎం కేసీఆర్ భరోసాతో మునుగోడు ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని, మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనాన్ని ముందుగా ఊహించిందేనని నామ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి అహంకారం ఓడి ,మునుగోడు ప్రజల ఆత్మ గౌరవం గెలిచిందని అన్నారు. ప్రత్యర్థి పార్టీలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, ప్రలోభాలతో, నియంతృత్వంతో వ్యవహరించినా టీఆర్ఎస్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుందన్నారు. టీఆర్ఎస్ కు పట్టం కట్టిన మునుగోడు ఓటర్లకు ధన్యవాదాలు తెలియజేశారు.
మునుగోడు ఫలితంతో దేశంలో బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమైందని ఆయన అన్నారు. కేవలం డబ్బు , అహంకారంతో పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్రెడ్డికి మునుగోడు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. ప్రత్యర్థి పార్టీలు చేసిన ప్రలోభ ప్రచారాలను తిప్పికొట్టి, ప్రజలు కేసీఆర్కు మునుగోడును బహుమానంగా ఇచ్చారని నామ అన్నారు. మునుగోడు ప్రజలు కేసీఆర్ను గుండెల్లో పెట్టుకొన్నారని, టీఆర్ఎస్ పార్టీని కాపాడుకున్నారని పేర్కొన్నారు. ఈ విజయంతో దేశ్ కీ నేత కేసీఆర్ అని స్పష్టమైందన్నారు నామా. కేసీఆర్ ప్రభుత్వం 8 ఏళ్లలో చేసిన కనీవినీ ఎరుగని అభివృద్ధికి మునుగోడు ఓటర్లు జైకొట్టారని నామ అన్నారు.