Rain Alert | హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడిచింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం సాధారణ వర్షపాతం 5.2 మి.మీ. వర్షపాతం కురవాల్సి ఉండగా, 21.5 మి.మీ వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా 54.9 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది వానకాలం సీజన్లో సగటు సాధారణ వర్షపాతం 608 మి.మీ. ఉండగా, మంగళవారం వరకు 729.2 మి.మీ. వర్షపాతం నమోదైందని, ఇది ఈ సీజన్లో 20% అధికంగా ఉన్నట్టు వెల్లడించింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో స్వల్పంగా లోటు వర్షపాతం నమోదైనట్టు పేర్కొన్నది.
మహారాష్ట్ర, కర్ణాటకలతోపాటు రాష్ట్రం లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద ప్రవాహాలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. ఎల్లంపల్లికి ప్రాజెక్టుకు 2.25లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, లక్ష్మీబరాజ్ వద్ద 3.05 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. రాజరాజేశ్వర జలాశయానికి 10వేల క్యూసెక్కుల వరద వస్తున్నది. ఇక కృష్ణాలో స్వల్పంగా వరద ప్రవాహం మొదలైంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 11వేల క్యూసెక్కుల వరద చేరుతున్నది.