హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ)/శంషాబాద్ రూరల్: రాష్ట్రవ్యాప్తంగా జూన్ నెలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉష్ణోగ్రతలు కూడా చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయని పేర్కొన్నది. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటం వల్ల జూన్ నుంచి సెప్టెంబర్ వరకు దక్షిణ ద్వీపకల్ప ప్రాంతంపై సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురుస్తాయని వివరించింది. నైరుతి రుతుపవనాలు చిక్మగళూరు, బెంగళూరు మీదుగా వెళ్తున్నాయని, రాష్ట్రంలోకి పశ్చిమ దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నాయని వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో 2వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
మంగళవారం భారీ వర్షం కారణంగా శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాజమండ్రి, ఢిల్లీ నుంచి రావాల్సిన విమానాలను బెంగళూరుకు, పాట్నా నుంచి రావాల్సిన విమానాన్ని విజయవాడ విమానాశ్రయానికి తరలించినట్టు అధికారులు తెలిపారు.