హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆదివారం నుంచి పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ దిశ నుంచి కిందిస్థాయి గాలులతో వచ్చే 5 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరుగుతాయని పేర్కొన్నది. ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎండలు మండుతుండగా, ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువలో ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో 39.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, సంగారెడ్డి జిల్లా కల్హేర్లో 38.7, మెదక్ జిల్లా శివ్వంపేటలో 37.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలు పెరగనున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి, జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఎండ వేడికి ప్రజలు ఎవరూ బయటికి రాకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.
వాతావరణ శాఖ 150 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లో ఐఎండీ వ్యవస్థాపక వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. వాతావరణ శాఖ సంచాలకుడు డాక్టర్ నాగరత్న అధ్యక్షతన జరిగిన సదస్సుకు పర్యావరణ వేత్త, వర్షపు నీరు ప్రాజెక్ట్ ఫౌండర్ కల్పనా రమేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వాతావరణ మార్పులు, నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించిన కల్పనా రమేశ్, భవిష్యత్తు తరాలకు సురక్షితమైన నీటిని అందించేందుకు ప్రతి ఒకరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మండే ఎండలకు అడవుల్లోని మూగజీవాలు తాగునీటికి తహతహలాడుతున్నాయి. దీంతో మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీ శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. నీటి కుంటలు, చెక్డ్యామ్లు నిర్మించి సౌర పంపుసెట్ల ద్వారా వన్యప్రాణుల దాహార్తిని తీరుస్తున్నారు. ఈ ప్రాంతంలో 11,700 హెక్టార్లలో అటవీ ప్రాంతం ఉన్నది. ఇకడ కోతులు, ఎలుగుబంట్లు, కొండ గొర్రెలు, కుందేళ్లు వంటి వన్య ప్రాణులు ఉన్నాయి. వేసవిలో ఆ జంతువులు తాగునీటికి ఇబ్బందులు పడుతుంటాయి. బయటకు వెళ్లకుండా అడవిలోనే దాహార్తిని తీర్చడానికి శాశ్వత చర్యలు చేపట్టినట్టు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బీ అంబర్సింగ్ వెల్లడించారు.