హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లోని మిగిలిన ప్రాంతాలు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. మధ్యప్రదేశ్ పరిసరాలపై ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతున్నదని వెల్లడించింది. దీంతో వచ్చే రెండురోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.
ముఖ్యంగా కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్జ్ జారీ చేసినట్టు వెల్లడించింది. ఆదిలాబాద్ కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉన్నదని వివరించింది. కాగా, గడిచిన 24గంటల్లో నిర్మల్, నల్లగొండ, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసినట్టు తెలిపింది.