Monsoon | హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం ఖమ్మంలోకి ప్రవేశించిన రుతుపవనాలు నిజామాబాద్ వరకు విస్తరించినట్టు ప్రకటించింది. ఒకటి, రెండు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించే అవకాశం ఉన్నదని వెల్లడించింది. శుక్రవారం వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు దగ్గరలో సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల వరకు ఆవర్తనం కొనసాగుతున్నది. ఎత్తుకి వెళ్లే కొలది నైరుతి దిశగా కొనసాగుతుందని వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం వర్షం కురిసింది. గురువారం నుంచే వాతావరణం చల్లబడగా.. రాత్రి అక్కడక్కడ ఓ మోస్తరు వాన పడింది. శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్రంలోని చాలా చోట్ల వర్షం కురిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలతోపాటు నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేట, రంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. శని, ఆదివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ప్రకటించింది.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో శుక్రవారం పలు జిల్లాల్లో వర్షం కురిసింది. సిద్దిపేట, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాన దంచికొట్టింది. హనుమకొండ, వరంగల్లో భారీ వర్షం పడగా మిగతా చోట్ల ఓ మోస్తరు వాన కురిసింది. ఖమ్మం జిల్లావ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.