హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): ఈనెల మొదటివారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా మండుటెండలు సెగలు పుట్టిస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా గురువారం అన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలకుపైగా నమోదయ్యాయని వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో అత్యంత గరిష్ఠంగా 39 డిగ్రీలు నమోదు కాగా, 21 జిల్లాల్లో 38 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వివరించింది. రానున్న రోజుల్లో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట తదితర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 39 నుంచి 41 డిగ్రీల వరకు చేరవచ్చని హెచ్చరించింది. హైదరాబాద్ నగరంలో పగటి ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల నుంచి 37 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయని తెలిపింది. అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టు వివరించింది.
ప్రజలు మధ్యాహ్నం వేళల్లో ఎక్కువగా బయటకు రావొద్దని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. గత ఈ ఏడాది ఎల్నినో ప్రభావం వల్ల సాధారణం కంటే ఎక్కువ రోజులు వడగాల్పులు వీచే అవకాశం ఉన్నదని తెలిపింది. ఇదిలా ఉండగా.. రాబోయే రోజుల్లో వాతావరణంలో అనూహ్యంగా మార్పులు చోటుచేసుకుంటాయని వెల్లడించింది. ఈ క్రమంలో 18 వరకు భానుడి భగభగలు కొనసాగి, ఆ తర్వాత అకాల వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. ఫిబ్రవరిలో కురిసిన వానల కంటే ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతోపాటు కొన్నిచోట్ల పిడుగులు పడే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. పంట కోత దశలో ఉన్న రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.