హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర, కర్ణాటక మీదుగా తమిళనాడు దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాగల మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతాయని వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానలు కురిసే అవకాశమున్నదని పేర్కొన్నది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.