Shadnagar | షాద్నగర్, మే 2: మగబిడ్డపై ఉన్న మమకారంతో మధ్యవర్తి ద్వారా కొడుకును కొన్న దంపతులు.. కడుపుతీపి పట్టలేక తిరిగి బిడ్డ కోసం వచ్చిన ఓ అమ్మను బలిగొన్నారు. ఈ ఘటన మంగళవారం షాద్నగర్లో చోటుచేసుకున్నది. షాద్నగర్ ఏసీపీ కుషల్కర్ కథనం ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలం కొర్ర తండాకు చెందిన సభావత్ రాములు కుటుంబసభ్యులతో కలిసి షాద్నగర్లో నివాసం ఉంటున్నాడు. రాములు దంపతులకు కూతురు ఉన్నది. కుమారుడు లేడనే బాధను ఓ రోజు తన ఇంటి సమీపంలో ఉండే బీహార్కు చెందిన పురుషోత్తంతో చెప్పాడు.
తన రెండో భార్య దేవకికి కొడుకు ఉన్నాడు.. కొంటావా? అని పురుషోత్తం అడిగాడు. రాములు అంగీకరించడంతో.. దేవకి కుమారుడిని అమ్మాలనే నిర్ణయానికి వచ్చారు. రాములు ఐదు నెలల క్రితం రూ.1.5 లక్షలు చెల్లించి దేవకి కుమారుడిని తన ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటినుంచి దేవకి తరచూ తన కొడుకును చూసేందుకు రాము లు ఇంటికి వస్తుండేది. ఈ విషయంలో రాములు కుటుంబ సభ్యులు, దేవకి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే దేవకిని వదిలించుకోవాలంటే హత్య చేయడం ఒక్కటే మార్గమని రాములు భావించాడు.
సోమవారం రాత్రి మరోమారు దేవకి రాములు ఇంటికి వచ్చి కొడుకు కోసం గొడవపడింది. ఇదే అదునుగా భావించిన రాములు, జ్యోతి, శారద కలిసి ఇంట్లోనే దేవకి గొంతునులిమి దారుణంగా హత్య చేశారు. ఆమె మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి షాద్నగర్ శివారులోని బుచ్చిగూడ రోడ్డులో పడేసేందుకు వెళ్తుండగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్న షాద్నగర్ పోలీసులు గుర్తించి రాములును పట్టుకున్నారు. పోలీసుల విచారణలో రాములు, జ్యోతి, శారద చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. విధి నిర్వహణలో చిత్తశుద్ధిని చూపిన పోలీస్ కానిస్టేబుళ్లను సీపీ స్టీఫెన్ రవీంద్ర అభినందించారు.