Revanth Reddy | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 26 (నమస్తే తెలంగాణ): ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లీజుపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన నిరాధారణ ఆరోపణలను హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) సీరియస్గా తీసుకొన్నది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తంచేస్తూ రేవంత్రెడ్డికి లీగల్ నోటీసులు జారీచేసింది. నోటీసు అందుకొన్న 48 గంటల్లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా రేవంత్రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. లేని పక్షంలో న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకొంటామని హెచ్చరించింది. లోక్సభ సభ్యుడిగా, ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఏది మాట్లాడినా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తుందని, అందువల్ల చేసే ప్రతి ప్రకటన, చెప్పే మాట బాధ్యతాయుతంగా ఉండాలని సూచించింది.
కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారమే ఓఆర్ఆర్ను లీజుకు ఇచ్చామని హెచ్ఎండీఏ స్పష్టంచేసింది. గత ఏడాది నవంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వం టీవోటీ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిందని, అంతర్జాతీయ బిడ్లను ఆహ్వానించేందుకు చేపట్టిన ఈ టెండర్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని అధికారులు తెలిపారు. అత్యధిక బిడ్ దాఖలు చేసిన ఐఆర్బీ ఇన్ఫ్రా డెవలపర్స్ లిమిటెడ్కు లీజు ఖరారు చేస్తూ గత నెల 27న లెటర్ ఆఫ్ అవార్డు జారీచేశామని వివరించారు. టెండర్ ప్రక్రియకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఐఆర్బీ ఇన్ఫ్రాకు జారీ చేసిన డాక్యుమెంట్లు, ఇతర వివరాలన్నీ ఆన్లైన్లో ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజలకు అందుబాటులో అన్ని వి వరాలు ఉన్నప్పటికీ బాధ్యతాయుత పదవి లో ఉండి కుట్రపూరితంగా ఓఆర్ఆర్ లీజుపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని హెచ్ఎండీఏ నోటీసుల్లో రేవంత్పై మండిపడింది.
హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగా ణ): ఔటర్ రింగ్ రోడ్డు కాంట్రాక్టుపై అవాస్తవాలను ప్రచారం చే యడంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. బీజే పీ వాట్సాప్ యూనివర్సిటీని మించిపోయారని తెలంగాణ పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ చైర్మన్ వై సతీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. కాంట్రాక్టు సంస్థ అదనపు గడువు అడిగిందన్న రేవంత్ ఆరోపణల్లో నిజం లేదని హెచ్ఎండీఏ క్లారిటీ ఇచ్చిందని, హెచ్ఎండీఏ పంపిన లీగల్ నోటీసుకు సమాధానం చెప్పాలని రేవంత్ను డిమాండ్ చేశారు. ఇదే ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థ కాంగ్రెస్ పాలిత రాజస్థాన్, హిమాచల్ప్రదేశ్లో కాంట్రాక్టులు చేస్తున్న విషయం ఆయనకు తెలియదా? అని ప్రశ్నించారు.
బీజేపీ పాలిత గుజరాత్, కర్ణాటకలోనూ ఐఆర్బీ ఇన్ఫ్రా కాం ట్రాక్టులు చేస్తున్నదని వివరించారు. కాం ట్రాక్టు కంపెనీని బ్లాక్ మెయిల్ చేసేందుకే రేవంత్ ఇదంతా చేస్తున్నారా? లేకపోతే ఇప్పటికే డబ్బులు డిమాండ్ చేసి, ఇవ్వకపోతే ఆరోపణలు చేస్తున్నారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయని అన్నా రు. సమాచార హక్కు చట్టాన్ని ఆదా య మార్గంగా మార్చుకున్న రేవంత్ బుద్ధి రాష్ట్రంలో ప్రతి ఒకరికి తెలుసని వ్యాఖ్యానించారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని రాష్ట్ర ప్రభుత్వానికి, హెచ్ఎండీఏకు రేవంత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.