హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): ఐటీ రంగంలో దేశంలోనే హైదరాబాద్ మొదటి స్థానంలో ఉన్నదని, బెంగళూరును మించిపోతున్నామని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ప్రపంచ ప్రసిద్ధ ఐటీ కంపెనీలు హైదరాబాద్కు రావడానికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ విధానాలే కారణమని చెప్పారు. టీన్యూస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నిజాం కాలేజీ మైదానంలో సోమవారం నిర్వహించిన 9వ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ముగింపు కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ విద్య, వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నారని వివరించారు.
ఇంజినీరింగ్ విద్యార్థులు నాలుగేండ్లు కష్టపడి చదివితే చక్కటి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. విద్యార్థులు పబ్ కల్చర్, సినిమాలు వంటి వాటికి దూరంగా ఉంటే విజయాలు వరిస్తాయని అన్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్ అయినవారికే పెద్ద కంపెనీల్లో భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు టీన్యూస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఇంజినీరింగ్ కాలేజీలపై సమగ్ర అవగాహన కల్పిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్లో పాల్గొన్న కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులకు జ్ఞాపికలు బహూకరించారు. కార్యక్రమంలో శ్రీదత్తా ఇంజినీరింగ్ కాలేజీ యజమాని పాండురంగారెడ్డి, కెరీర్ కౌన్సెలర్ ప్రొఫెసర్ డీ రవి, టీన్యూస్ ప్రతినిధి ఉపేందర్తోపాటు పలు కాలేజీల యాజమాన్యాలు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
విజయవంతంగా ముగిసిన టీ న్యూస్ 9వ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్
టీన్యూస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్లో ఈ నెల 13 నుంచి నిర్వహిస్తున్న 9వ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్-2022 విజయంతంగా ముగిసింది. ఫెయిర్లో ప్రదర్శించిన ఇంజినీరింగ్ కాలేజీలు, అకాడమీలు ఏర్పాటు చేసిన స్టాళ్లను వీక్షించి, ఉన్నత విద్యపై తమకు ఉన్న అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు తరలివచ్చారు. ఇంజినీరింగ్ విద్యలో ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్లేస్మెంట్ వంటి అవకాశాలపై సీబీఐటీ కాలేజీ ప్రొఫెసర్ శ్రీనివాస్ అండోజ్ వివరించారు. వెబ్ కౌన్సెలింగ్ గురించి ప్రొఫెసర్ రాజు వివరించారు. ఫెయిర్కు హాజరైన వారిలో లక్కీడ్రా విజేత డీ సతీశ్కు మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా ల్యాప్టాప్ను బహూకరించారు.