Plasma | హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): అక్రమంగా మానవ ప్లాస్మాను సేకరించి, విక్రయిస్తున్న రాకెట్ను ఛేదించినట్టు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీ కమలాసన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లోని పలు బ్లడ్ బ్యాంక్లపై అధికారులు దాడులు చేసిన సందర్భంగా ఈ దందా వెలుగులోకి వచ్చినట్టు చెప్పారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూసాపేటలోని భవానీ నగర్లో నిర్వహిస్తున్న ‘హీమో సర్వీస్ ల్యాబొరేటరీస్’లో డీసీఏ అధికారులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున నిల్వ చేసిన మానవ రక్తాన్ని, ప్లాస్మాను గుర్తించారు. నగరంలోని పలు బ్లడ్ బ్యాంకుల నుంచి అక్రమంగా రక్తాన్ని, ప్లాస్మాను సేకరించి ఇలా నిల్వ చేశారని, వీటిని అక్రమంగా విక్రయిస్తున్నట్టు కనిపెట్టారు.
నిర్వాహకుడు ఆర్ రాఘవేంద్ర నాయక్ ఎనిమిదేండ్లుగా ఈ దందా చేస్తున్నట్టు తేల్చారు. అంతేకాకుండా నేరుగా మనుషుల నుంచి రక్తాన్ని సేకరించి నిల్వ చేస్తున్నట్టు గుర్తించారు. విచారణలో భాగంగా మియాపూర్లోని శ్రీకర హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, దారుల్ఫియాలోని అబీద్ అలీఖాన్ లయన్స్ ఐ హాస్పిటల్లో ఉన్న న్యూ లైఫ్ బ్లడ్ సెంటర్, ఏపీ కర్నూల్లో ఉన్న ఆర్ ఆర్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ నుంచి అక్రమంగా ప్లాస్మా కొనుగోలు చేస్తున్నట్టు రాఘవేంద్ర నాయక్ ఒప్పుకొన్నాడని డీజీ తెలిపారు.
అతడు బాలానగర్లోని క్లిన్స్ ల్యాబ్స్, క్యూపీఎస్ బయోసర్వ్ ఇండియా, ఐడీఏ మల్లాపూర్లోని శిల్పా మెడికా, మదీనాగూడ లోని జెనసిస్ రీసెర్చ్, చర్లపల్లిలోని విమ్టా ల్యాబ్స్, విశాఫట్నంలోని ఆక్టిమస్ బయో సైన్సెస్, పుణెలోని క్లినోవి రిసెర్చ్, బెంగళూరులోని జీ7 సినర్జిన్కు అక్రమంగా ప్లాస్మాను అమ్ముతున్నట్టు గుర్తించామని వివరించారు. అతడు ఇప్పటివరకు 6వేల యూనిట్లను విక్రయించారని తెలిపారు. బ్లడ్ బ్యాంకుల నుంచి రూ.700 కొని, కంపెనీలకు రూ.3,800కు విక్రయిస్తున్నాడని చెప్పారు. ఈ దాడుల్లో డ్రగ్ ఇన్స్పెక్టర్లు సౌభాగ్యలక్ష్మి, శ్రీనివాస్, సహజ, చంద్రశేఖర్, సంతోష్, కార్తిక్ శివ చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఈ సమాచారం ఆధారంగా అధికారులు ఆయా బ్లడ్ బ్యాంకులు, కంపెనీల్లో సోదాలు నిర్వహించినట్టు తెలిసింది.