హైదరాబాద్కు వరసగా రెండోసారి అంతర్జాతీయ గుర్తింపు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్కు మరోసారి అంతర్జాతీయ గౌరవం లభించింది. ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో)తోపాటు అర్బన్ డే ఫౌండేషన్ వరుసగా రెండో ఏడాది హైదరాబాద్ను ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్-2021’గా ప్రకటించాయి. హైదరాబాద్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటడం, వాటిని సంరక్షించేందుకు చర్యలు చేపట్టడంతో ఈ గుర్తింపు లభించింది. భారత వాణిజ్య రాజధాని ముంబై సహా అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా తదితర 63 దేశాల నుంచి మొత్తం 130 నగరాలు ఈ గుర్తింపు కోసం పోటీపడగా.. చివరకు హైదరాబాద్ విజేతగా నిలిచింది.
ఇతర నగరాలకు ఆదర్శం
గ్రేటర్ హైదరాబాద్లోని అర్బన్ ఫారెస్ట్ బ్లాక్లు, ఎవెన్యూ ప్లాంటేషన్ వివరాలతోపాటు పలు కార్యాలయాలు, విశ్వ విద్యాలయాలు, పాఠశాలలు, ఖాళీ స్థలాల్లో చేపట్టిన హరితహారం వివరాలతో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ పంపిన ప్రతిపాదనలను పరిశీలించి హైదరాబాద్ను మరోసారి ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్-2021’గా ప్రకటిస్తున్నట్టు ఎఫ్ఏవో, అర్బన్ డే ఫౌండేషన్ వెల్లడించాయి. అర్బన్, కమ్యూనిటీ ఫారెస్ట్రీలో హైదరాబాద్ ప్రపంచంలోని పలు నగరాలకు ఆదర్శంగా నిలిచిందని ప్రతినిధులు ప్రశంసించారు. పెద్ద సంఖ్యలో మొక్కలు నాటడం, మినీ అడవుల ఏర్పాటుతో హైదరాబాద్ను అత్యంత ఆరోగ్యకరమైన, నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దటం అభినందనీయమని కొనియాడారు.
ప్రజలందరి భాగస్వామ్యంతోనే..
ఎంతో అందమైన హైదరాబాద్ నగరానికి ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్’గా గుర్తింపు లభించటం సహజమే. ఎందుకంటే.. హైదరాబాద్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. మరోవైపు గ్రీన్ ఇండియా చాలెంజ్లో ఎంతో మంది ప్రజలు మొక్కలను నాటి, వాటిని సంరక్షిస్తున్నారు. ప్రభుత్వంతోపాటు ప్రజలందరి భాగస్వామ్యం వల్లే హైదరాబాద్ హరిత కాంతులీనుతున్నది. అందుకే మరోసారి ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్గా ఎంపికైంది.
– జే సంతోష్కుమార్, రాజ్యసభ సభ్యుడు