వనపర్తి, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసి సాగునీటితో నేలతల్లి పాదాలను అభిషేకం చేసిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. చెరువుల అభివృద్ధికి కృషి చేసిన కాకతీయులు, రెడ్డి రాజులకు మించిన ఘన చరిత్ర సీఎం కేసీఆర్దే అని అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అధ్యక్షత వహించి ప్రసంగించారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న తెలంగాణ జన శేఖరుడు మన చంద్రశేఖరుడని శ్లాఘించారు. నూతన జిల్లాగా పురుడుపోసుకున్న వనపర్తి.. అనేక అభివృద్ధి పనులతో సీఎంకు స్వాగతం పలికిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారన్నారు. మెడికల్, నర్సింగ్, ఇంజినీరింగ్ కళాశాలతోపాటు అనేక ప్రాజెక్టులు ఇచ్చారన్నారు. వనపర్తి వాసులు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న రోడ్ల విస్తరణకు నిధులు మంజూరు చేశాడన్నారు. జిల్లాలో ప్రతి గుంట సాగులోకి వచ్చి బంగారు పంటలు పండుతున్నాయని, సీఎం కేసీఆర్ వల్లే సస్యశ్యామలమైందన్నారు. తెలంగాణకు, సమైఖ్య రాష్ర్టానికి తేడా ఏంటో సీఎ కేసీఆర్ చేసి చూపించారన్నారు. సీఎం గొప్పతనమేంటో అందరికీ తెలిసిందన్నారు. టీఆర్ఎస్ సర్కార్తో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. కర్నెతండా లిఫ్ట్ను మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.