హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 13: అచ్చం మోసగాళ్లు సినిమా లెక్క.. విదేశీయులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు చేసిన మోసం ఇది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా రూ.50 కోట్లు కొట్టేశారు. ఢిల్లీ, హైదరాబాద్కు చెందిన సైబర్ ముఠా ఆస్ట్రేలియా, యూకే, సింగపూర్ వాసులకు భారీ కుచ్చుటోపీ పెట్టింది. ఢిల్లీకి చెందిన నవీన్ భుటానీ, మోహిత్, హైదరాబాద్కు చెందిన నాగరాజు, శ్రావణ్, మోను, శ్రీనివాస్రావు, వెన్నెలకంటి ఒక ముఠాగా ఏర్పడ్డారు. నవీన్ భుటానీ 2017లో ఆర్ఎన్టెక్ సర్వీసెస్ సంస్థను స్థాపించి ఢిల్లీ, ఘజియాబాద్, పంజాబ్లో కాల్సెంటర్లను నిర్వహిస్తున్నాడు. కంప్యూటర్లలో వైరస్, ఇతర సాంకేతిక సమస్యలు పరిష్కరిస్తామని ఆస్ట్రేలియా, సింగపూర్, యూకే దేశాల్లో గూగుల్ యాడ్స్ ఇస్తున్నాడు. అందుకోసం ఒక టోల్ఫ్రీ నంబర్ కూడా జత చేశాడు. అవి చూసి నంబర్కు ఫోన్ చేయగానే ‘గో టు అసిస్ట్’ అనే యాప్ డౌన్లోడ్ చేయించి, వారి కంప్యూటర్ను కంట్రోల్లోకి తీసుకొని వారి బ్యాంక్, ఆన్లైన్ వ్యవహరాల సమాచారాన్ని ముఠా చోరీ చేస్తున్నది. విదేశీయులు రాత్రి నిద్రపోయాక చోరీ చేసిన సమాచారంతో వాళ్ల బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. మోసాన్ని గుర్తించి బ్యాంక్లకు ఫిర్యాదు చేసేలోపే ముఠా ఖాతాల్లోకి పేమెంట్ గేట్వేల ద్వారా నగదును ట్రాన్స్ఫర్ చేసుకొంటున్నారు. హైదరాబాద్కు చెందిన నాగరాజు 8 వెబ్సైట్లను సృష్టించి, వాటికి పేమెంట్ గేట్వేలను తీసుకొని 8 ఖాతాలను తెరిచాడు. ఈ ముఠా మోసాలతో పేమెంట్ గేట్వే సంస్థలకు నష్టాలు రావటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాయి. హైదరాబాద్కు చెందిన హెల్తీ డెంటల్ క్లినిక్ కూడా 85 లావాదేవీల్లో రూ.64.04 లక్షల ఆర్థిక లావాదేవీలను నిర్వహించింది. దానికి గేట్వేగా ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఇంటెలిజెన్స్ అధికారులకు అనుమానం వచ్చి క్లినిక్ను ఆరా తీయగా పొంతన లేని సమాధానం వచ్చింది. దీంతో ఆ బ్యాంక్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేపట్టగా విదేశీయులను మోసం చేసిన విషయం కూడా బయటికి వచ్చింది. నిందితుల వద్ద రూ.1.11 కోట్ల నగదు, మూడు కార్లు, నాలుగు ల్యాప్టాప్లు, 10 సీపీయూలు, 16 చెక్బుక్కులు, 18 డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకొన్నారు. సమావేశంలో సైబర్ క్రైం ఏసీపీ శ్రీధర్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. కాగా, ఈ ముఠా వాడిన టోల్ఫ్రీ నంబర్ను పరిశీలిస్తే దాదాపు 33 వేల మంది విదేశీయులు ఫోన్ చేసినట్టు తేలింది.