మావోయిజాన్ని అణచివేసిన స్ఫూర్తితో పనిచేస్తాం
డ్రగ్స్ నియంత్రణకు వెయ్యిమందితో కొత్త వ్యవస్థ: డీజీపీ
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 9 : మావోయిజాన్ని అణచివేసినట్టుగానే డ్రగ్స్ను కూడా ఉక్కుపాదంతో అణచివేస్తామని డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు. డ్రగ్స్ నియంత్రణ కోసం కొత్త విభాగం ఏర్పాటుపై కసరత్తు జరుగుతున్నదని వెల్లడించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ నియంత్రణ కోసం సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్(హెచ్న్యూ), నార్కోటిక్ ఇన్విస్టిగేషన్ సూపర్విజన్ వింగ్(ఎన్ఐఎస్డబ్ల్యూ) విభాగాలను బుధవారం కమిషనరేట్ కార్యాలయంలో డీజీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ ప్రమాదాన్ని ముందుచూపుతో గుర్తించి ముఖ్యమంత్రి కేసీఆర్.. మాదకద్రవ్యాలను కూకటివేళ్లతో పెకిలించి, రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని నాలుగు నెలలుగా రెండు సార్లు పోలీసులు, ఎక్సైజ్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారని చెప్పారు. డ్రగ్స్ నియంత్రణకు కొత్త వ్యవస్థ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారని, దానికోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని డీజీపీ తెలిపారు. మావోయిజం, ఉగ్రవాదం, మతకలహాల వంటి వాటిని పూర్తిగా అణచివేసేందుకు ఏర్పాటుచేసిన ఎస్ఐబీ, అక్టోపస్ వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో అలాంటి కొత్త వ్యవస్థను డ్రగ్స్ నియంత్రణ కోసం అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ను పూర్తిగా అణిచివేసే లక్ష్యంతో 10 రోజులుగా అధికారులతో చర్చించి హెచ్న్యూ, ఎన్ఐఎస్డబ్ల్యూలను ప్రారంభించామని అన్నారు. ప్రస్తుతానికి సీపీ కార్యాలయ ఆవరణలో వీటి కార్యాలయాలను ఏర్పాటు చేశామని చెప్పారు. సౌత్ జోన్ డీసీపీ చక్రవర్తి గుమ్మి సారథ్యం వహిస్తారని, హెచ్న్యూలో ఒక ఏసీపీ, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, నలుగురు ఎస్సైలు, 20 మంది కానిస్టేబుళ్లు ఇందులో ఉంటారని, ఎన్ఐఎస్డబ్ల్యూలో ఒక ఏసీపీ, ఒక ఇన్స్పెక్టర్, ఒక ఎస్సై, ఆరుగురు కానిస్టేబుళ్లు ఉంటారని వివరించారు. కార్యక్రమంలో అదనపు సీపీలు చౌహాన్, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఐజీ రాజేశ్వర్, అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్, జాయింట్ సీపీలు రమేశ్, రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.