హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): సిక్కిం వరదల్లో చిక్కుకున్న తెలంగాణ టూరిస్టులంతా క్షేమంగా ఉండటంతో వారిని సురక్షితంగా రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అక్కడ భారీ వర్షం కారణంగా వాతావరణ పరిస్థితులు సహకరించకపోవడంతో రెస్క్యూ వాయిదా పడుతున్నట్టు బాధిత కుటుంబసభ్యులు ‘నమస్తే తెలంగాణ’ తెలిపారు. ఆదివారం వారిని ప్రత్యేక హెలికాప్టర్లో తరలించేందుకు సిక్కిం ఆర్మీ ప్రయత్నించగా.. మళ్లీ భారీ వర్షం పడటం, వరద పెరగడంతో రెస్క్యూ ఆగిపోయిందని చెప్పారు. తెలంగాణకు చెందిన వారిని అక్కడి పోలీసులు సురక్షితంగా ఓ హోటల్కు తీసుకెళ్లి, వసతి ఏర్పాట్లు చేశారు.
ఈ ఏర్పాట్లపై ఢిల్లీ తెలంగాణభవన్ రెసిడెంట్ ఆఫీసర్తో సమన్వయం చేసుకుంటూ, సిక్కిం అధికారులతో సీఎస్ శాంతికుమారి మాట్లాడుతున్నారు. వీలైతే హెలికాప్టర్ ద్వారా వాతావరణం అనుకూలిస్తే గ్యాంగ్టక్ వరకు రోడ్డుమార్గంలోనైనా మనవారిని రప్పించేందుకు, అక్కడ్నుంచి తెలంగాణ సురక్షితంగా తీసుకొచ్చేందుకు అక్కడి అధికారులతో మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికే సిక్కిం డీజీపీ అమరేంద్రకుమార్ సింగ్ (ఏకే సింగ్)తో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడారు. సీవీ ఆనంద్ ఇచ్చిన వివరాల ఆధారంగా వారికి సురక్షితంగా తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని సిక్కిం డీజీపీ ఆర్మీ అధికారులకు సూచించారు. ప్రస్తుతం సిక్కింలో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడం, ఫోన్లకు సిగ్నల్స్ అందకపోవడంతో అక్కడి పోలీసులు శాటిలైట్ ఫోన్ను అందుబాటులో ఉంచారు. దాని ద్వారానే తమ క్షేమ సమాచారాన్ని కుటుంబసభ్యులకు చేరవేస్తున్నారు.