హైదరాబాద్ జనవరి 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నట్టు డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. యువత వినాశనానికి కారణమయ్యే మాదకద్రవ్యాల అక్రమ రవాణాను తెలంగాణ పోలీసులు సమర్థవంగా అడ్డుకుంటున్నారని అభినందించారు. శుక్రవారం సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్భగవత్ ఆధ్వర్యంలో ఎన్డీపీఎస్ చట్టం, దర్యాప్తు ప్రక్రియపై రాష్ట్రంలోని నార్కోటిక్ పోలీసు అధికారులకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. నార్కోటిక్స్ డ్రగ్స్, సైకోట్రోపిక్స్ చట్టాన్ని అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా ఉన్నదని చెప్పారు. గొలుసుకట్టుగా సాగే మాదక ద్రవ్యాల పంపిణీని అరికట్టడానికి ఆధునిక, శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తు చేయాలని సూచించారు.
2022లో మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్న 1,278 మందిపై కేసులు నమోదు చేసి, వీరిలో 218 మందిపై పీడీయాక్టు నమోదు చేశామని వివరించారు. ఈ మూడేండ్లలో మొత్తం 416 మందిపై పీడీ యాక్టు నమోదుచేసినట్టు వెల్లడించారు. గత మూడేండ్లలో 7,498 మందిని అరెస్ట్ చేశామని, 89,718 కిలోల గంజాయి, 711 కిలోల ఇతర డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అడిషనల్ డీజీ మహేశ్భగవత్ మాట్లాడుతూ.. తెలంగాణ పోలీస్శాఖ ఇప్పటికే మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నదని, అక్రమారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నదని వివరించారు. కార్యక్రమంలో ఏ రంగదాస్, డాక్టర్ వెంకన్న, అనసూయ తదితరులు పాల్గొన్నారు.