హైదరాబాద్ : రాష్ట్ర అవతరణ తర్వాత హైదరాబాద్ బుక్ ఫెయిర్ జాతీయస్థాయి పుస్తక ప్రదర్శనగా ఎదిగిందని, ఇది జ్ఞాన తెలంగాణకు పనిముట్టుగా ఉపయోగపడుతుందని సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మంగళవారం మంత్రి కార్యాలయంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు, తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరు గౌరీశంకర్ మంత్రిని కలిసి ఈనెల 22 నుంచి జనవరి 1వ తేదీ వరకు తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్) స్టేడియంలో జరిగే పుస్తక ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించి ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఆధ్వర్యంలో 35 ఏండ్లుగా బుక్ ఎగ్జిబిషన్ నిర్వహించడం అభినందనీయమన్నారు. జాతీయ పుస్తక ప్రదర్శనగా పేరొందిందని చెప్పారు. ప్రభుత్వం తరుపున పుస్తక ప్రదర్శన తెలంగాణ కళాభారతి స్థలాన్ని ప్రతి యేటా ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. బుక్ ఫెయిర్ను విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న, బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షుడు కోయ చంద్రమోహన్ పాల్గొన్నారు.