హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రోత్సహించే దిశగా హైదరాబాద్ వ్యవసాయ సహకార సం ఘం (హాకా) కీలక నిర్ణయం తీసుకున్నది. అందుబాటు ధరల్లో రైతులకు యంత్రాలను అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ యంత్రాల షోరూమ్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. తెలంగాణతోపాటు 21 రాష్ర్టాల్లో వ్యాపారాన్ని నిర్వహించాలని యోచిస్తున్నది. సోమవారం హైదరాబాద్లోని హాకా భవన్లోని జరిగిన జనరల్ బాడీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరిగిన సమావేశ వివరాలను హాకా చైర్మన్ మచ్చా శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. తొలుత ఉమ్మడి జిల్లాల్లో షోరూమ్ల ఏర్పాటుతో ట్రాక్టర్లు, వరి కోత యంత్రాలు తదితర యంత్రాలన్నీ అందుబాటులో ఉంచుతామని చెప్పారు.
దేశవ్యాప్తంగా హాకా వ్యాపారాన్ని విస్తరించాలని నిర్ణయించినట్టు శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణకే పరిమితమైన వ్యాపారాన్ని 21 రాష్ర్టాలకు విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆయా రాష్ర్టాల్లో హాకా కార్యాలయాలు ఏర్పాటు చేయాలని, ఇందుకోసం హాకా నిబంధనల్లో మార్పులు చేస్తున్నట్టు పేర్కొన్నారు. దీంతో పాటు హాకా కిరాణ సరుకుల దుకాణాలను మరిన్ని ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించనున్నట్టు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎండీ సురేందర్, జనరల్ మేనేజర్ రాజమోహన్, హాకా సభ్యులు పాల్గొన్నారు.