హైదరాబాద్ సిటీబ్యూరో, మే 23 (నమస్తే తెలంగాణ): దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎతె్తైన బహుళ అంతస్తుల నివాస భవనం హైదరాబాద్లో కొలువుదీరుతున్నది. ‘ది స్కైవెన్’ పేరిట ఈ-ఇన్ఫ్రా, పింగ్లే వెంచర్స్ అండ్ రియాల్టీ (పీవీఆర్) సంస్థలు కోకాపేటలో సంయుక్తంగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నాయి. 63 అంతస్తుల (755 అడుగుల) ఎత్తయిన ఈ భవనం దక్షిణ భారత దేశంలో తొలి ‘ఏఐ-రెడీ’ స్మార్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్గా నిలవనున్నదని నిర్మాణదారులు శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు.
సాధారణ ప్రాజెక్టుల్లో స్మార్ట్ హోమ్ ఫీచర్లను నిర్మాణ చివరి దశలో జోడిస్తారని, ఈ ప్రాజెక్టులో మాత్రం పునాది దశలోనే కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత మౌలిక సదుపాయాలను అంతర్భాగం చేశామని తెలిపారు. వీటిలో ఏఐ స్మార్ట్ బిల్డింగ్ సిస్టమ్స్, ైక్లెమేట్ కంట్రోల్, ఎనర్జీ ఆప్టిమైజేషన్, విజిటర్ అథెంటికేషన్, ప్రెడిక్టివ్ మెయింటెనెన్స్ వ్యవస్థలు ఉన్నాయని, భవనం రూఫ్-టాప్పై లగ్జరీ హాస్పిటాలిటీ అనుభూతిని ఇచ్చేలా ‘ది ఎవరెస్ట్’ క్లబ్ను డిజైన్ చేశామని వివరించారు. మీడియా సమావేశంలో ఈ-ఇన్ఫ్రా డైరెక్టర్ రమేశ్రెడ్డి మేడా, పింగ్లే వెంచర్స్ ఫౌండర్ పింగ్లే వాసుదేవరెడ్డి, ఎలిగాంటియా ఇన్ఫ్రా పార్టనర్ జితేందర్ కేడియా, ఈ-ఇన్ఫ్రా పార్టనర్ స్నేహిత్రెడ్డి మేడా పాల్గొన్నారు.