జువెనైల్ బోర్డును కోరనున్న పోలీసులు
జూబ్లీ కేసులో నిందితులకు బిగుస్తున్న ఉచ్చు
సాదుద్దీన్ మాలిక్కు మొదటిరోజు కస్టడీ పూర్తి
మిగతా ఐదుగురు జువెనైల్స్కు 4 రోజుల కస్టడీ
హైదరాబాద్ సిటీబ్యూరో/బంజారాహిల్స్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ సామూహిక లైంగిక దాడి ఘటనలో నేరాలకు పాల్పడ్డ నిందితులకు చట్టపరంగా పక్కాగా శిక్షలు పడేవిధంగా పోలీసులు అడుగులు వేస్తున్నారు. జువెనైల్ జస్టిస్ యాక్ట్, 2015 సవరణల ప్రకారం తీవ్రమైన, క్రూరమైన నేరాలు చేసిన 16 నుంచి 18 సంవత్సరాల వయసున్న జువెనైల్స్ను మేజర్లుగా పరిగణించి విచారణ జరిపేందుకు అవకాశం కల్పించారు. ఈ క్రమంలో తీవ్రమైన నేరంచేసిన నిందితులు చట్టం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకుండా పోలీసులు పకడ్బందీగా ఆధారాలు సేకరిస్తున్నారు. చార్జిషీట్ దాఖ లు చేసిన తరువాత మేజైర్లెన నిందితులు తీవ్రమైన నేరం చేసినందుకు వాళ్లను పెద్దవాళ్లుగా భావించి విచారణ చేయాలని న్యాయస్థానాన్ని కోరనున్నారు. ఫాస్ట్ట్రాక్ కోర్టులో విచారణ జరిపించనున్నారు.
మరో పక్క ఈ కేసులో నిందితుడు సాదుద్దీన్ మాలిక్ను 4 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించడంతో గురువారం చంచల్గూడ జైలు నుంచి జుబ్లీహిల్స్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. తొలిరోజు బంజారాహిల్స్ ఏసీపీ నేతృత్వంలోని బృందం మాలిక్ను విచారించింది. నిందితుడు, 28న పబ్ వద్దకు ఎలా వచ్చాడు? మిగతా నిందితులు ఎక్కడి నుంచి వచ్చారనే విషయాలపై ఆరా తీశారు. బాధితురాలితో ఎలా పరిచయం అయింది.. మిగతా నిందితులందరు లైంగిక దాడికి ఎక్కడ ప్లాన్ చేశారు.. ఈ ఆరుగురు కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే విషయాలను విచారించారు. పోలీసులు సేకరించిన శాస్త్రీయ ఆధారాలను నిందితుడి ముందు పెట్టి వాటిలో మరింత స్పష్టత తీసుకొన్నారు. కార్లలో వెళ్తూ వీడియోలు తీసుకొని వాటిని సోషల్మీడియాలో పెట్టడం, వీడియో రికార్డు వెనుక బ్లాక్మెయిలింగ్ చేయాలనే ఆలోచనలపై దర్యాప్తు బృందం విచారించింది. బాధితురాలిని ఏ విధంగా ట్రాప్ చేశారు, ఆమె ఫోన్, కండ్లద్దాలు లాక్కొని వేధించి, బ్లాక్మెయిలింగ్కు పాల్పడిందెవరన్న అంశాలను పోలీసులు సేకరిస్తున్నారు.
పోలీస్ కస్టడీకి మిగతా నిందితులు
ఈ ఘటనకు బాధ్యులైన మిగతా ఐదుగురు నిందితులు జువెనైల్స్ను కూడా నాలుగు రోజుల కస్టడీకి జువెనైల్ జస్టిస్ బోర్డు అనుమతించింది. వీరిని జువెనైల్ హోంలోనే విచారించాలని ఆదేశించింది. శుక్రవారం నుంచి వీరిని పోలీసులు ఒక్కొక్కరిగా, గ్రూపులుగా విచారిస్తారు. ఘటన జరిగిన రోజు నిందితులు వేసుకున్న దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు చెప్పే విషయాలు.. వారి సెల్ఫోన్ డాటా, సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి పోలీసులు నిర్ధారించుకుంటున్నారు. మరోపక్క నిందితుల టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ కోసం కూడా పోలీసులు పిటిషన్ వేశారు. నిందితులందరినీ ఘటనాస్థలానికి తీసుకెళ్లే అవకాశమున్నది. పబ్కు, బేకరీకి తీసుకెళ్లడమే కాకుండా ఇన్నోవా కారును ఎక్కడెక్కడ తిప్పారు.. నిర్జన ప్రదేశంలో ఎంతసేపు ఆపారనే అంశాలపై క్రైం సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసే అవకాశాలున్నాయి. మరోవైపు స్వాధీనం చేసుకొన్న దుస్తులను కూడా ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించే అవకాశాలున్నాయి. ఇన్నోవాలో లభించిన వివిధ రకాల ఆధారాలను నిందితుల దుస్తుల్లో లభించే ఆధారాలతో సరిపోలుస్తారు.
మంచి నిర్ణయం
తీవ్రమైన నేరం చేసిన నిందితులను పెద్దవాళ్లుగా భావించాలని కోర్టును కోరాలనుకుంటున్న తెలంగాణ పోలీసుల నిర్ణయానికి మంత్రి కేటీఆర్ మద్దతు ప్రకటించారు. ‘పెద్దల తరహాలో లైంగికదాడి వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడ్డప్పుడు జువెనైల్గా పరిగణించకుండా..తప్పకుండా మేజర్లుగానే పరిగణించి శిక్షించాలి’ అని కేటీఆర్ ట్విట్టర్లో అభిప్రాయపడ్డారు.