కరీంనగర్, మే 16 (నమస్తే తెలంగాణ)/కరీంనగర్ కార్పొరేషన్: మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ను బర్తరఫ్చేయడంతో తమకు నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల సొంత మండలమైన కమలాపూర్ పరిధిలోని శనిగరం, మర్రిపల్లిగూడెం గ్రామాల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు స్పష్టంచేశారు. ఆదివారం కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్తో వారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈటల ఉద్యమకారులను పక్కనపెట్టి సొంతవారికి పెద్దపీట వేశారని విమర్శించారు. ద్వితీయశ్రేణి నాయకులను ఏనాడూ ప్రోత్సహించలేదని, డివైడ్ అండ్ రూల్ పాలసీతో అణచివేశారని దుయ్యబట్టారు. పార్టీని అడ్డుపెట్టుకొని ఆర్థికంగా బలోపేతం అయ్యారని ఆరోపించారు.
ఆయన సొంత మండలంలోనూ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని పేర్కొన్నారు. కేవలం తన స్వార్థ ప్రయోజనాలకోసం అధికారాన్ని దుర్వినియోగంచేశారని, అక్రమాస్తులను కూడబెట్టుకున్నారని విమర్శించారు. పార్టీకి చెందిన ఏ కార్యకర్త కూడా ఆయన వెంటలేరని చెప్పారు. హుజూరాబాద్ నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి తన వారి కోసం మాత్రమే పనిచేశారని విమర్శించారు. పార్టీ వల్లే ఎవరికైనా పేరు వచ్చిందని, అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తామంతా కట్టుబడి ఉంటామని స్పష్టంచేశారు. నియోజకవర్గంలోని అనేక సమస్యలు ప్రభుత్వం దృష్టికి రాకుండా ప్రయత్నించి, కార్యకర్తలను అణచివేశారని మండిపడ్డారు. తామంతా సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామని తెలిపారు. శనిగరం, మరిపల్లిగూడెం గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఈ సందర్భంగా మంత్రి గంగులకు వివరించారు. భగీరథ ఎత్తిపోతల పథకాన్ని రైతుల కంట్రిబ్యూషన్ కింద పునరుద్ధరణ చేయాలని కోరారు.
ఈ గ్రామాల్లోని చెక్ డ్యాంలవరకు రోడ్ల నిర్మాణంతోపాటు పెండింగ్లో ఉన్న సీసీ రోడ్లను మంజూరుచేయాలని విజ్ఞప్తిచేశారు. మంత్రితో సమావేశమైనవారిలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పింగిళి ప్రదీప్రెడ్డి, శనిగరం సర్పంచ్ పింగళి రవళి రంజిత్రెడ్డి, ఉప సర్పంచ్ మేకల తిరుపతి, స్థానిక నాయకులు చెరిపల్లి రాంచందర్, కొలిపాక సాంబయ్య, రతన్, ఎం భిక్షపతి, సంగెం కవిత కరుణాకర్, కొత్తపల్లి శ్రీదేవి రాజు, బండి కుమారస్వామి, కోల రమేశ్, కుక్కల యుగేందర్, బండి జ్యోతి భద్రయ్య, సుప్రియ, మంజుల భూమయ్య, శివాజీ, శ్రీకాంత్, పవన్, చంద్రశేఖర్ ఉన్నారు.
టీఆర్ఎస్ వెంటే ఉంటాం
మంత్రి గంగులను ఆదివారం కరీంనగర్లో హుజూరాబాద్ జడ్పీటీసీ సభ్యుడు బక్కారెడ్డి, జమ్మికుంట ఎంపీపీ దొడ్డె మమత, హుజూరాబాద్, వీణవంక ఎంపీపీలు రాణి సురేందర్రెడ్డి, రేణుక తిరుపతిరెడ్డి, ఎంపీటీసీలు రాచపల్లి రాజయ్య, పోల్సాని రాజేశ్వర్రావు, సంపెల్లి స్వరూప భీమ్రావు వేర్వేరుగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈటల పదవిలో ఉన్నప్పుడు కార్యకర్తలను పట్టించుకోకుండా స్వార్థంకోసం పని చేసుకొన్నారని ఆరోపించారు. పార్టీ ఆదేశాల మేరకు మంత్రి గంగుల కమలాకర్కు విధేయతగా పనిచేస్తుంటే ఆయన్ను విమర్శించడం సరికాదని హితవుపలికారు. తాము ఎప్పుడూ టీఆర్ఎస్ వెంటే ఉంటామని స్పష్టంచేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, కరీంనగర్ మేయర్ వై సునీల్రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు పాల్గొన్నారు.