వీణవంక, డిసెంబర్ 30: కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన కల్యాణలక్ష్మి చెక్కులను ప్రోటోకాల్ పాటించకుండా, నియోజకవర్గ ఎమ్మెల్యేనైనా తనకు సమాచారం ఇవ్వకుండా అర్ధరాత్రి చెక్కులు పంపిణీ చేయడమే ప్రజాపాలనా? అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రశ్నించారు. శనివారం ఆయన కరీంనగర్ జిల్లా వీణవంకలో మీడియాతో మాట్లాడారు. ఇటీవల కరీంనగర్లో జరిగిన సమీక్షలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీకి సహకరించాలని ఇన్చార్జి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా కలెక్టర్కు చెబుతానన్నట్టు తెలిపారు.
కనీస సమాచారం ఇవ్వకుండా ఆర్డీవో, తహసీల్దార్ శుక్రవారం అర్ధరాత్రి వేళ లబ్ధిదారులకు చెక్కులు అందజేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. తాను ఇంటింటికీ తిరిగి చెక్కులు పంపిణీ చేస్తుంటే చూసి ఓర్వలేక, ఇబ్బంది పెట్టాలనే అర్ధరాత్రి 12 గంటలకు చెక్కులు పంపిణీ చేశారని విమర్శించారు. కల్యాణలక్ష్మి చెక్కులతోపాటు తులం బంగారం ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గవద్దని ఆయన కలెక్టర్కు సూచించారు.