Padi Kaushik Reddy | కమలాపూర్: తన గొంతులో ప్రాణమున్నంత వరకు కేసీఆర్తోనే ఉంటానని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తొలిసారి హనుమకొండ జిల్లాలోని కమలాపూర్కు రావడంతో పద్మశాలీ కమ్యూనిటీ హాల్లో మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు కౌశిక్రెడ్డిని కలిసి సన్మానం చేశారు.
ఈ సందర్భంగా కౌశిక్రెడ్డి మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తానని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీని వీడేదేలేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకంతో గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మాటతప్పకుండా మడమ తిప్పకుండా పనిచేస్తానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను తూచ తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి షరతులు లేకుండా కేసీఆర్ ఎలాగైతే ఇచ్చారో అలాగే రైతులందరికీ రైతుబంధు ఇవ్వాలన్నారు. క్వింటాలుకు ఐదు వందల బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని రైతులకు బోనస్ కూడా చెల్లించాలన్నారు.